Nemali-Temple-Governing-Body-Delay : అందరి చూపూ.. నెమలి పైనే Andhra Prabha Exclusive Story
Nemali-Temple-Governing-Body-Delay : అందరి చూపూ.. నెమలి పైనే Andhra Prabha Exclusive Story
- మేడూరులోనూ.. ఇదే స్థితి
- అటు వేణుగోపాలుడు..మౌన రాగం
- ఇటు వీరాంజనేయుడు,, జాప్య జపం
- మౌన పాలనలో తదేకం
- పాలక మండలి భర్తీలో తీవ్ర ఆలస్యం
- కూటమి శ్రేణుల్లో అసంతృప్తి
( గంపలగూడెం, ఆంధ్రప్రభ)
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం పూర్తి స్థాయి పాలకవర్గం కోసం ఎదురుచూస్తోంది. ఆలయానికి కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 8న నోటిఫికేషన్ విడుదల కాగా, పలువురు ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. అధికార కూటమిలోని ఎమ్మెల్యే వర్గం నుంచి కొందరు, ఎంపీ వర్గం నుంచి మరికొందరు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దరఖాస్తుల పరిశీలన అనంతరం సంబంధిత దస్త్రాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినప్పటికీ, ఇప్పటివరకు తుది ఆమోదం లభించకపోవడంతో నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో దరఖాస్తుదారులు నియామక ఉత్తర్వుల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
రెండున్నరేళ్లు దాటినా.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నప్పటికీ పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తిస్థాయిలో జరగకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. తమకు అవకాశం లభిస్తుందని ఆశిస్తున్న నాయకులు, కార్యకర్తలు పదవుల కోసం నిరీక్షిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తే పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఎన్నికల సమయం సమీపించిన తర్వాత హడావుడిగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం కంటే ముందుగానే ప్రక్రియను పూర్తి చేస్తే పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంటుందని అంటున్నారు. ప్రస్తుతం పదవుల భర్తీలో జరుగుతున్న జాప్యం ఆశావహుల్లో అసంతృప్తికి కారణమవుతోందని తెలుస్తోంది.
మేడూరు అంజి స్వామికి …
మరోవైపు మేడూరు శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం కూడా పూర్తిస్థాయి పాలకవర్గం లేకుండానే కొనసాగుతోంది. ప్రస్తుతం మేనేజర్ పర్యవేక్షణలో ఆలయ నిర్వహణ సాగుతోంది. దేవాదాయ శాఖ పరిధిలోని పలు ఆలయాలకు అధికారిక పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు, నిర్వహణ, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.ఆలయాల పాలకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, ప్రముఖులకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఆలయాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంటుందని భక్తులు భావిస్తున్నారు.
అందరి చూపు నెమలి పైనే…..
నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పాలకవర్గ నియామకంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ముఖ్యంగా చైర్మన్ పదవితో పాటు సభ్యులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే వర్గం నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ప్రాధాన్యం లభిస్తుందా? ఎంపీ వర్గం నుంచి వచ్చిన దరఖాస్తుదారులకు అవకాశం కల్పిస్తారా? ఇరు వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఉంటుందా? అనే చర్చ స్థానికంగా సాగుతోంది.పాలకవర్గం ఏర్పాటు ఆలస్యం కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్లో ఉన్న దస్త్రాలకు త్వరితగతిన ఆమోదం లభించి నియామక ప్రక్రియ పూర్తవుతుందని వారు ఆశిస్తున్నారు. పాలకవర్గం కొలువుదీరిన అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు వేగవంతమవుతాయని స్థానికులు భావిస్తున్నారు.నెమలి, మేడూరు ఆలయాలకు పాలకవర్గాలను ఏర్పాటు చేయడంతో పాటు దేవాదాయ శాఖ పరిధిలోని ఇతర ఆలయాల్లోనూ ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను త్వరితగతిన భర్తీ చేయాలని భక్తులు,స్థానికులు,కూటమి శ్రేణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
