న్యూ ఢిల్లీ – పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అక్కడి ప్రజలు భారత్లో విలీనం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అతి త్వరలో పీవోకేను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఢిల్లీలో నేడు జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే ప్రజలకు భారత్తో విడదీయరాని, దృఢమైన సంబంధాలున్నాయని ఆయన పునరుద్ఘాటించారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు మన కుటుంబసభ్యులు అని రాజ్నాథ్ తెలిపారు. భౌగోళికంగా వేరు పడిన వారు ఎప్పటికైనా ఇండియాలో కలుస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ చాలా బలంగా ఉందన్నారు. పీవోకేలోని చాలా మంది ప్రజలు ఇండియాలో కలవాలని కోరుకుంటున్నారని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు.
కొంతమంది మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారని ఆయన వివరించారు. పీవోకే ప్రజలు ఏదో ఒక రోజు భారత్లో ఏకమవుతారని.. ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. పీవోకే దానంతట అదే వస్తుందని.. అక్కడున్న వారికి ఇండియాతో దృఢమైన బంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. పీవోకేలోని మెజారిటీ ప్రజలు భారత్లో కలవాలని కోరుకుంటున్నారని.. కొందరు మాత్రమే తప్పుదారి పట్టారని చెప్పుకొచ్చారు. మనం ఏదైనా చేయగలమని.. అయితే శక్తితో పాటు సంయమనం కూడా చాలా అవసరమని స్పష్టం చేశారు రాజ్నాథ్. మేకిన్ ఇండియా ఆవశ్యకత ఏంటో ఆపరేషన్ సిందూర్తో అందరూ గ్రహించారని వ్యాఖ్యానించారు.