నరసరావుపేటకు మంత్రి నారా లోకేష్‌.. టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం

10 వేల మందితో భారీ ర్యాలీ.. పసుపుమయంగా మారిన పురవీధులు
రూ.70 కోట్లతో నిర్మించిన జేఎన్‌టీయూ హాస్టళ్ల ప్రారంభానికి ఏర్పాట్లు

నరసరావుపేట, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ప్రభుత్వ విప్‌ జీవీ ఆంజనేయులు తదితర ప్రజాప్రతినిధులు మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికారు. మంత్రి పర్యటన సందర్భంగా నరసరావుపేట పురవీధులు పసుపుమయంగా మారాయి. ఎస్‌ఆర్‌కేటీ బైపాస్‌ నుంచి మల్లమ్మ సెంటర్‌, ఆర్టీసీ బస్టాండ్‌, వై జంక్షన్‌ వరకు టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. సుమారు 10 వేల మందితో చేపట్టిన ఈ ర్యాలీతో పట్టణంలో సందడి నెలకొంది. భారీగా జన సమీకరణ చేయడంలో ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు కీలకంగా వ్యవహరించారు.

అనంతరం కాకాని వద్ద ఉన్న జేఎన్‌టీయూకేలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించనున్నారు. సుమారు రూ.70 కోట్లతో నిర్మించిన బాలుర, బాలికల నూతన హాస్టళ్లను ఆయన ప్రారంభించనున్నారు. జేఎన్‌టీయూ విద్యార్థుల కోసం నిర్మించిన ఈ హాస్టళ్ల ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రి లోకేష్‌ పర్యటన నేపథ్యంలో నరసరావుపేటలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పట్టణమంతా పార్టీ జెండాలు, శ్రేణుల సందడితో పసుపుమయంగా కనిపించింది.