హైదరాబాద్, : ఈ స్వరంలో ఏదో మాయ ఉంది, వింటుంటే మనస్సు పులకించిపోతుంది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అది స్వరం కాదు, హృదయాన్ని మాయ చేసే ఒక మంత్ర స్వరం. ఆ గళంలోని ప్రతి నాదం మనస్సును మెలిపెట్టేస్తుంది. ఆ సంగీత సంచలనం ఎవరో కాదు, మన సిద్ శ్రీరామ్. ఆయన సరికొత్త గీతం ‘కన్నె’లో మాటలకందని భావాలను పలికించారు. ఇది ఒక ప్రేమ గీతం. ఈ పాటను అయనే స్వయంగా కంపోజ్ చేసి, పాడారు.
తమిళంలో వివేక్, తెలుగులో కిట్టు విస్సాప్రగడ రచించారు. ఈ పాటను ఈనెల 6వ తేదీన వార్నర్ మ్యూజిక్ విడుదల చేసింది. ఏప్రిల్లో భక్తిగీతం ‘శివనార్’ విడుదల అయింది. ఆ తర్వాత ఇప్పుడు విడుదలైన ఈ పాట కూడా భారతీయ భాషల్లో ఉన్న సంగీతాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశగా మరో అడుగుగా చెప్పవచ్చు.
ఈ పాటకు సంగీతప్రియుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ‘కన్నె’ పాటలో ప్రేమ అనేది కేంద్ర బిందువుగా ఉంటుంది. ప్రేమలో ఉన్న గాఢత, మనస్సులో మార్పులు, ప్రేమ వల్ల కలిగే ఉద్వేగాలను ఎంతో చక్కగా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిద్ శ్రీరామ్ మాట్లాడుతూ ఈ పాట ప్రజల హృదయాలను తాకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వార్నర్ మ్యూజిక్ ఇండియాతో నా ప్రయాణంలో ఇది రెండో పాట అన్నారు.
‘కన్నె’ నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్న ప్రత్యేకమైన పాట ఇదన్నారు. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన సమయంలో కలిగే మార్పులను, భావోద్వేగాలను ఈ ‘కన్నె’ పాట గుర్తుకు తెస్తుందన్నారు.
సిద్ శ్రీరామ్ అనేక భాషలలో ఎన్నో గీతాలు పాడారు. ఆయన పాడిన పాటలు భారీ విజయాన్ని సాధించాయి. అవి.. ‘శ్రీవల్లి’ (పుష్ప : ది రైజ్), ‘కుంకుమాలా’ (బ్రహ్మాస్త్ర), ‘అదియే’ (కదల్), ‘కన్నానా కన్నే’ (విశ్వాసం), ‘శివనార్’ వంటి గీతాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది శ్రోతల మనస్సును గెలుచుకున్నాయి.
2024లో ప్రపంచ ప్రఖ్యాత కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చిన తొలి దక్షిణ భారత కళాకారుడిగా చరిత్రలో నిలిచారు. 2025లో ఆయన నుంచి మరిన్ని గీతాలు రానున్నాయి.