Minister | స్థానిక పాలనలో… బీసీ లకు పెద్ద పీట

Minister | స్థానిక పాలనలో… బీసీ లకు పెద్ద పీట

34 శాతం రిజర్వేషన్లే లక్ష్యం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
ఏక సభ్య కమిషన్ గా రాజీవ్ రంజన్ మిశ్రా నియామకం
కమిషన్ నియామకంపై సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు
మిశ్రా కమిషన్ తో బీసీలకు మేలు : మంత్రి సవిత

Minister | వెలగపూడి ,ఆంధ్ర ప్రభః స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. దీనిలో భాగంగానే మాజీ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్ నియమించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికే పరిమితం చేసిందన్నారు. దీనివల్ల బీసీలు ఎన్నో పదవులు కోల్పోయారన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీనిలో భాగంగా దీనిలో భాగంగానే మాజీ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్ నియమించిందన్నారు.

ఈ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నామన్నారు. నా బీసీలు అంటూ వెనుకబడిన కులాలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసిందన్నారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కోత విధించి, సమాజంలో సగభాగమైన వెనుకబడి వర్గాల వారిని రాజ్యాధికారానికి దూరం చేశారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆది నుంచి బీసీల పక్షపాతి అని తెలిపారు. బీసీలకు జరిగిన ద్రోహాన్ని గుర్తించి, అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు అందజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్ ను నియమించారన్నారు.

రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తో బీసీలకు మేలు

ఏపీలో ఎస్సీ వర్గీకరణంపై నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా విజయవంతమైన పాత్ర పోషించిందని మంత్రి సవిత తెలిపారు. రాజీవ్ రంజాన్ మిశ్రా సమర్థత గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు… ఆయన నేతృత్వంలో డెడికేటెట్ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిషన్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్ నియమించినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. డెడికేటెట్ కమిషన్ నియామకంపై బీసీ సంఘాలు సైతం హర్షం వ్యక్తంచేశాయి. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కు, మంత్రులు లోకేశ్, సవితకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply