Medical Entrance | నీట్ పిజి పరీక్ష తేది ఖరారు – ఆగ‌స్ట్ మూడో తేదిన ఎగ్జామ్

సుప్రం కోర్టు అనుమతితో ఆగ‌స్ట్ మూడో తేదిన ఎగ్జామ్
దేశ వ్యాప్తంగా ఒకే షిఫ్ట్ లో ప‌రీక్ష
ఎగ్జామ్ కు హాజ‌రు కానున్న 2.43 లక్షల మంది మెడికోస్
రెండు షిఫ్ట్ ల ప‌రీక్ష‌కు సుప్రీం అభ్యంత‌రం
దీంతో జూన్ 15న జ‌ర‌గాల్సిన ఎగ్జామ్ వాయిదా
నేడు కొత్త తేదీని ప్ర‌క‌టించిన జాతీయ మెడిక‌ల్ బోర్డు

న్యూ ఢిల్లీ – సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఒకే షిఫ్ట్‌లో నీట్‌ పీజీ 2025 పరీక్షను నిర్వహించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టు అనుమ‌తితో కొత్త తేదిన ప్ర‌క‌టించింది. ఈ ఎగ్జామ్ ఆగ‌స్ట్ మూడో తేదిన నిర్వ‌హించ‌నుంది. ఒకే షిఫ్ట్ లో దేశ‌వ్యాప్తంగా ఎగ్జామ్ జ‌రుగుతుంద‌ని బోర్డు నేడు ప్ర‌క‌టించింది..

వాస్త‌వానికి ఈ ప‌రీక్ష జూన్‌ 15న నిర్వహించాల్సి ఉంది.. అయితే రెండు షిఫ్ట్ ల‌లో ప‌రీక్ష నిర్వ‌హిణ‌కు సుప్రీం కోర్టు అభ్యంత‌రం తెలిపింది.. ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌బీఈ) ఇటీవల ప్రకటన జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఒకే షిఫ్ట్‌లో సుమారు 2.43 లక్షల మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించడం సాధ్యంకాదని, అందుకు పరీక్ష కేంద్రాల సంఖ్యతో పాటు ఇతర మౌలిక సదుపాయాలనూ భారీగా పెంచాల్సి ఉంటుందని ఎన్‌బీఈ పేర్కొంది. అందుకు మరింత సమయం అవసరం అవుతుందని, అందుకే పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు విన్నవించింది.

తాజాగా కొత్త పరీక్ష తేదీని నిర్ణయించిన నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌బీఈ).. నీట్‌-పీజీ-2025 పరీక్షను జూన్‌ 15 నుంచి ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసేందుకు అనుమతి కోరుతూ మంగళవారం (జూన్‌ 3) అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆగస్టు 3వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే షిఫ్టులో నీట్‌ పీజీ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్‌బీఈ తన పిటిషన్‌లో తెలియచేసింది. నిర్వహణకు సాంకేతిక భాగస్వామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (టీసీఎస్‌) ఆగస్టు 3వ తేదీని సూచించినట్లు ఎన్‌బీఈ తన పిటిషన్‌లో వివరించింది. ఈ తేదీన పరీక్షను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఎన్‌బీఈ సుప్రీంకోర్టును కోరింది. దీనిపై నేడు విచార‌ణ జ‌రిపిన సుప్రీం కోర్టు బోర్డు సూచించిన తేదిన ఎగ్జామ్ జ‌రిపేందుకు అనుమ‌తి ఇచ్చింది..

Leave a Reply