మావోళ్లను మాకివ్వాలి రవి, అరుణ, అంజూ మృతదేహాల కోసం బంధువుల ఆక్రోశం
రంపచోడవరం ఆసుపత్రికి మృతదేహాల తరలింపు
రంపచోడవరంలో పోలీసుల భారీ బందోబస్తు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
గ్రే హౌండ్స్ ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గాజర్ల రవి, రావి అరుణ, అంజూ మృత దేహాల కోసం రక్త సంబంధీకులు రంప చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పడిగాపులు పడుతున్నారు. మావోళ్లను చంపితే చంపారు కనీసం శవాలను చూపించాలని ఆక్రోశిస్తున్నారు. ఈ స్థితిలో అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో ఉత్కంఠ నెలకొంది. రంపచోడవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పాపికొండల అభయారణ్యంలోని గోదావరి – పాములేరు నది పరివాహక ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ లో మృతి చెందారనే సమాచారంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా-ఒడిశా ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణష్ అలియాస్ బిరుపూ, దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సతీమణి, ఆంధ్రా-ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ అలియాస్ అంకిత అలియాస్ రూప్సీ, ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా కుంట ఏరియా కమిటీ సభ్యురాలు, ఏసీఎం అంజు బంధువులు, కుటుంబ సభ్యులు గురువారం తెల్లవారుజాముకే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. మృతులను గుర్తించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మానవత్వం చూపించి మావాళ్లను మాకు అప్పగించండని మావోయిస్టు నేతల బంధువులు మొర పెట్టుకున్నారు.
అడ్డుకున్న పోలీసులు..
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గాజర్ల రవి సోదరుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అశోక్, ఏవోబీ స్పెషల్ జోన్ సభ్యురాలు రావి అరుణ తండ్రి లక్ష్మణరావు, సోదరి ఝాన్సీ, అమరుల బందువుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ తదితరులు మృత దేహాలను చూసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి సమీపంలో పెద్ద సంఖ్యలో జనం చేరారు. ఫార్మాలిటీస్ పూర్తికాలేదని, అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు సమాధానం ఇచ్చారు. ఇక మావోయిస్టుల మృతదేహాల ఫొటోలను తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లగా .. మీడియాకూ కూడా అనుమతి ఇవ్వలేదు. మృతదేహాలను చూపించిన తర్వాత పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారని, ఇప్పటి వరకూ చూపించకుండా కాలం వృథా చేస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ రోజు తహసీల్దారు లేరు , రేపు ఇంకో ఆఫీసరు లేరు, ఎల్లుండి ప్రధాని మోదీ వస్తారు, బందోబస్తుకు వెళ్లాలంటారు. ఇలా కాలాక్షేపం చేసి మృతదేహాలు కుళ్లిపోయాయని .. అనాథల్లా దహనం చేస్తారా? అని బంధువులు స్థానిక పోలీసులను ప్రశ్నించారు. కానీ, పోలీసు అధికారుల్లో ఎలాంటి చలనం లేదని, ఆలస్యమయ్యే కొద్దీ మృతదేహాలు డీకంపోజ్ అయ్యే అవకాశం ఉందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చంపితే చంపారు.. శవాన్ని చూపించండి : గాజర్ల రవి సోదరుడు ఆశోక్
ఎన్కౌంటర్ లో మా అన్నయ్య మృతి చెందాడని మీడియా ద్వారా తెలుసుకున్నాం. కానీ అధికారిక సమాచారం రాలేదు. బుధవారం సాయంత్రం వరంగల్ పోలీసులు ఎన్ కౌంటర్ ను ధ్రువీకరించారు. కడసారి చూసుకునేందుకు రంపచోడవరంలోని ఏరియా ఆసుపత్రికి చేరుకున్నాం. అప్పటి నుంచి మృతదేహాన్ని చూపించాలని బతిమిలాడుతున్నాం. పోలీసులు కనికరించలేదు. ఇంతకీ చనిపోయింది మావాళ్ళ కాదా.. అని నిర్ధారించు కోవటనికి కనీసం శవాల ఫోటోలు కూడా ఇవ్వడం లేదు. అధికారులు వస్తారు, తహసీల్దార్ లేరు అని చెబుతున్నారు. కనీసం మీడియాకి కూడా ఫోటోలు కానీ, వీడియోలు కాని ఇవ్వలేదు. చంపనైతే చంపారు, కానీ శవాలను చూసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.
మా బిడ్డ శవాన్ని కడసారి చూడ్డానికి వచ్చాం
- అరుణ తండ్రి రావి లక్ష్మణ రావు
మా పిల్ల శవాన్ని కడసారి చూసుకోని ఇంటికి తీసుకు వెళ్లి అంతిమ సంస్కరాలు చేసుకుందామని ఇక్కడకు ఎంతో ఆశతో వచ్చాం. కానీ మా ఆశలు నేరవుటం లేదు. మమ్మల్ని అడ్డుకోవటానికే చూస్తున్నారే తప్ప మా బిడ్డ మృతదేహాన్ని చూపించడం లేదు. మమ్మళ్ళీ లోనికి వెళ్ళనివ్వ లేదు. గంటల తరబడి వేచి ఉన్నాం కనీసం మా కూతురి ముఖం చూపించడం లేదు . దేశంలో మానవ హక్కులు ఉన్నాయి కదా, స్వేచ్ఛ ఉంది కదా, రాజ్యాంగం ఉంది కదా, ఇవేమి కనిపించడం లేదు. తలలకు వెలలు కడుతున్నారు. చనిపోయినోళ్లను చూసుకుందామని వస్తే ఆసుపత్రి గేటు కూడా దాటనివ్వడం లేదు. న్యాయమెక్కడ ఉంది అని రావి అరుణ తండ్రి లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు.
నిజాలు తెలుస్తాయనే ….
- అరుణ సోదరి న్యాయవాది ఝాన్సీ
మావోయిస్టుల మృతదేహాలను చూపిస్తే అసలు నిజాలు బయటపడతాయని. శరీరంపై గాయాలను గుర్తించి తాము న్యాయపోరాటానికి వెళ్తేమనే భయంతోనే మృతదేహాలను చూపించటం లేదని మావోయిస్టు నేత అరుణ సోదరి ఝాన్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ఎన్ కౌంటర్ జరిగితే, ఏ ప్రదేశంలో జరిగిందో? ఎలాంటి గాయాలతో మృతి చెందారో ముందుగా పోలీసులు మీడియాకు ఫోటోలు పంపిస్తారని, కానీ నిన్న ఎన్ కౌంటర్ జరిగితే ఇంత వరకూ మృతదేహాల ఫోటోలను ఎందుకు విడుదల చేయలేదన్నారు. కొన్ని రోజుల కిందటే చంపేసి ఇప్పుడు ఎన్ కౌంటర్ కథ చెబుతున్నారా? అసలు ఇంతకీ ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయింది మా అక్కేనా, ఆ శవాన్ని గుర్తించటానికి చూపించండి, గతంలో ఇదే మాదిరిగా ఎన్ కౌంటర్ లో చనిపోయిందని వార్తలు వచ్చేవి, కానీ తప్పించుకున్నట్టు మరో సమాచారం తెలిసేది, కానీ ఈ సారి పోలీసులే ఎన్ కౌంటర్ కబురు చెప్పి శవాలను ఎందుకు చూపించటం లేదని న్యాయవాది ఝాన్సీ ప్రశ్నించారు.
శవాలను చూసే హక్కు లేదా
- పద్మ కుమారి, అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి
దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే మనుషుల పట్ల ఇలాగే ఉంటామా ? ఈ దేశంలో ఉన్న పౌరులగా ప్రశ్నిస్తే జవాబు చెప్పాల్సింది ఈ ప్రభుత్వాలు కాదా. ఎందుకు ఇంత గోప్యం. చంపిన తరువాత వాళ్ళను కుటుంబ సభ్యులకు చూపించాలి కదా. అది తమ బంధువు శవాన్ని చూసుకోవటం వాళ్ళ హక్కు కదా. మీ టెక్నాలజీ నుంచి ఫోటోలు తీసి చూపించలేని శక్తిహీనమైందా. మీడియా ద్వారా మృతి చెందిన మావోల మృతదేహాల ఫోటోలను చూపించవచ్చు కదా. ప్రభుత్వం మనుషులని చంపడమే ధ్యేయంగా ఉంది. నిన్న పొద్దుట శవాలను ఇస్తారని రవి తమ్ముడికి చెప్పారు, మాకు చాలా పాజిటివ్గా అనిపించి కానీ ఇదొక కుట్ర, శవాన్ని ఇవ్వం అని చెప్పరూ, ఇస్తాం అని చెప్పరూ గంట రెండు మూడు గంటలు అంటున్నారని అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ర్ట కార్యదర్శి పద్మకుమారి అన్నారు.