- మహిళా విద్యకు ఆధ్యుడు పూలే
- సంగారెడ్డిలో ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతి వేడుకలు
సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 11 (ఆంధ్రప్రభ) : అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మహాత్మ జ్యోతిబా ఫూలే 199వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబా ఫూలే విగ్రహానికి టీజీఐఐసీ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లతో కలిసి పూలమాలలు వేసి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మహాత్మ జ్యోతిబా ఫూలే సమాజంలో అనగారిన వర్గాలు అభ్యున్నతికి జీవితాన్ని అంకితం ఇచ్చిన మహా నాయకుడు అన్నారు.
ఆయన ఆడపిల్లల చదువు కోసం తన జీవితాన్ని అంకితం చేశాడన్నారు. సత్యశోధక సమాజం ద్వారా నిరుపేదలకు వివాహాలు జరిపించాడన్నారు. ఎన్నో పాఠశాలలు వసతి గృహాల ద్వారా అనేకమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపిన మహనీయుడన్నారు. మహిళా విద్యకు ఆంధ్రుడు పూలే అన్నారు. ఆయన చూపిన మార్గమే ఈనాటి అభివృద్ధికి మూలాధారంగా నిలుస్తుందన్నారు. సత్యమేవ జయతే నినాదంతో సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మ జ్యోతిబా ఫూలే అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు చంద్రశేఖర్, మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
