కాలిఫోర్నియా : టెక్ దిగ్గజం ‘గూగుల్’ మరోసారి లేఆఫ్స్ చేపట్టింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు లేఆఫ్లు ఇచ్చినట్లు సమాచారం. సంస్థకు చెందిన విశ్వసనీయ వర్గాల ద్వారా లేఆఫ్స్ విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే, ఎంతమందిపై లేఆఫ్స్ ప్రభావం పడిందన్నది కచ్చితంగా తెలియరాలేదు. కాగా, గూగుల్ గతేడాది డిసెంబర్లో కూడా 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. లేఆఫ్స్ పొందిన వారిలో డైరెక్టర్లు, మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారు ఉండటం గమనార్హం.
అంతకుముందు 2023 జనవరిలో 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా క్లౌడ్ ఆర్గనైజేషన్, హెచ్ఆర్ విభాగంలో కొంతమందిని తొలగించిన విషయం తెలిసిందే. వ్యయం తగ్గింపులో భాగంగా టెక్ దిగ్గజం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, అమెరికాలో మాంద్యం భయాలు, టారిఫ్ వార్, ఏఐ వినియోగం పెరగడం, లాభాల క్షీణత వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులకు లేఆఫ్లు ఇస్తున్నాయి.