- బీజేపీ – కాంగ్రెస్ కుమ్మకు రాజకీయాలు
- బీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోలేక కుట్రలు
- ఆరోపణలే కాదు.. విచారణ జరిపించండి
నిజామాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మారిందని చెప్పే అమిత్ షా, ఆ ఆరోపణలపై విచారణకు ఎందుకు ఆదేశించటం లేదని ప్రశ్నించారు.
సీబీఐ, ఈడీ విచారణకు ఏం అడ్డు వస్తోంది..
“దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ఉన్నాయి కదా? అవినీతిపై విచారణ జరిపించడానికి ఏం అడ్డొస్తుంది? ఢిల్లీలో కాంగ్రెస్తో బీజేపీకి కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ. ఇదే కమ్మక్కు రాజకీయాలతో రేవంత్ వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలకు సమాధానం ఉందా?” అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కోలేక, రేవంత్ రెడ్డిని బీజేపీ పావుగా వాడుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆర్ఆర్ టాక్స్ ఆరోపణలు ఏమయ్యాయి..
మునుపటి ప్రసంగాలను గుర్తు చేస్తూ, “దేశ ప్రధాని మోదీ గతంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి ‘ఆర్.ఆర్. టాక్స్’ పేరిట ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని స్వయంగా ఆరోపించారు. కానీ దర్యాప్తుకు మాత్రం ఇప్పటివరకు ఆదేశించలేదు. ఎందుకు?” అని సూటిగా ప్రశ్నించారు. అదే సమయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వంగా చర్యలు తీసుకోవడంలో విఫలమవడం పై విరుచుకుపడ్డారు. “పట్టపగలే ప్రజల సొమ్మును లూటీ చేస్తూ ఢిల్లీకి మూటలు పంపుతున్నట్టు మీరు చెబుతున్నారంటే, ఆ అక్రమాలను అడ్డుకునే బాధ్యత కేంద్రానికి లేదు అనుకోవాలా? మాటలకే పరిమితం కాక, చర్యలెందుకు ఉండవు?” అని ప్రశ్నల వర్షం కురిపించారు.
కాళేశ్వరంపై బురదజల్లడం దురదృష్టకరం
కాళేశ్వరం నిర్మాణంపై బురద జల్లడం దురదృష్టకరమని, అదే ప్రాజెక్టు వల్లే తెలంగాణ పంజాబ్ను అధిగమించి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. “ఇది రైతుల కృషి, నీటి పరిపాలన విజయానికి నిదర్శనం. దీనిపై విమర్శలు చేసేవాళ్లు రైతులను అవమానించడమే” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ నుండి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోవడం దారుణమని కేటీఆర్ ఆరోపించారు. ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కాలేజీ వంటి విద్యా సంస్థలు మంజూరు చేయకుండా అన్యాయంగా ప్రవర్తిస్తున్న కేంద్రాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.
పసుపు బోర్డుపై హై డ్రామా..
పసుపు బోర్డు విషయంలో కేంద్రం తీరుపైనా ఆయన మండిపడ్డారు. ‘‘ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించకుండా.. పేరుకు పసుపు బోర్డు పెట్టి రిబ్బన్ కట్ చేస్తే ప్రయోజనమేంటి ? కనీసం సొంత భవనం కూడా కట్టకుండా.. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించడం సమంజసమేనా ?’’ అని ప్రశ్నించారు.
అసలు ఒక్క పసుపు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభించడం సబబేనా?.. ఈ జనవరి 14న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ వర్చువల్ గా పసుపు బోర్డును ప్రారంభించేశారు. మరోసారి మీరు ఇవాళ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ప్రయోజనమేంటి ?
బనకచర్ల పేరుతో గోదావరి హక్కులపై దాడి..
ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు నదుల అనుసంధానం పేరుతో చేపట్టి, గోదావరిపై తెలంగాణ హక్కులను కాలరాయడం తగదన్నారు. విభజన చట్టం ప్రకారం బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని, హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేయడాన్ని తెలంగాణ ప్రజలపై ద్రోహంగా అభివర్ణించారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ.. ఉపాధికి పెను ముప్పు
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రైవేటీకరణకు దారితీసే ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ యువతకు భరోసా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. “ప్రాజెక్ట్ పెడుతున్నాం అని చెప్పి, నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకు అప్పగించాలంటే, అది ఉపాధికి భరోసా కాదు.. మోసం,” అని విమర్శించారు.
“కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే బీజేపీ తెలంగాణ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని… ఇది నాలుగు కోట్ల ప్రజలకు తెలుసు. అటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రావడం లేదు.. రాలేదు కూడా,” అంటూ కేటీఆర్ ఆగ్రహం వెల్లగక్కారు.