న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ పనుల తనిఖీ
క్రిటికల్ కేర్ బ్లాక్ త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశాలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్మాణంలో ఉన్న న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్లోని క్రిటికల్ కేర్ బ్లాక్ సివిల్ వర్క్ పురోగతిని ఏపీ ఎంఎస్ఐడీసీ అధికారులు (AP MSIDC officials) మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి అదనపు డీఎంఈ, సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు (Dr. K.Venkateswarlu) మాట్లాడుతూ… నిర్మాణ పనుల నాణ్యత, భవన నిర్మాణ దశలు, వైద్య పరికరాల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు సమీక్షించారని తెలిపారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలను సమర్థవంతంగా అందించేందుకు ఆధునిక సదుపాయాలతో క్రిటికల్ కేర్ బ్లాక్ను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
ఆసుపత్రి ఇంజనీరింగ్ విభాగపు అధికారులకు సివిల్ వర్క్ నాణ్యతను కాపాడుతూ.. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. క్రిటికల్ కేర్ బ్లాక్ (critical care block) పూర్తి అయితే అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను రక్షించేందుకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.ఓ. డా. వెంకటరమణ, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, అసోసియేట్ ప్రొఫెసర్ డా. శివబాల, ఏపీ ఎంఎస్ఐడీసీ డీఈ శిల్ప, జేఈ సెల్వం, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.

