ఏసీబీ వలలో..

ఏసీబీ వలలో..
డోన్ డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు…
రూ.35 వేల లంచం స్వీకరిస్తుండగా రెడ్హ్యాండెడ్గా…
తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అవినీతి మూలాలు వెలికితీయడంలో ఏసీబీ అధికారులు మరోసారి సత్తా చాటారు. డోన్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ (Deputy Tahsildar) సునీల్ రాజు, ఓ రైతు భూసమస్య పరిష్కారానికి రూ.35వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు మంగళవారం ఓ ప్లాన్ ప్రకారం ముందస్తు ఏర్పాట్లతో డోన్కు చేరుకుని, డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు (Sunil Raju) లంచం తీసుకుంటున్న క్షణంలోనే రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సునీల్ రాజు వద్ద నుండి డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ ఘటనతో కార్యాలయం సిబ్బందిలో ఒకింత భయాందోళన నెలకొంది.
దీనిపై అధికారులు పంచనామా నిర్వహించారు. డీఎస్పీ సోమన్న (DSP Somanna) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ ను విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. జిల్లాలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానికులు అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
