ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్గా మను భకర్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఒలింపిక్ మహిళల షూటింగ్ విభాగంలో భారత్కు లభించిన తొలి పతకం ఇదేకావడం విశేషం. ఈ క్రమంలో మనుభాకర్కు అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. మను భాకర్ను చూసి భారతదేశం గర్విస్తోందని.. ఆమె ఫీట్ చాలా మంది క్రీడాకారులకు.. ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఆమె భవిష్యత్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ హర్షం.
మను భకర్ పతకం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మను భకర్ సాధించిన కాంస్యం చారిత్రాత్మకమైన పతకమని అభివర్ణించారు. పారిస్ ఒలింపిక్స్లో తొలి పతకం అందించావు.. వెల్ డన్ మను భకర్ అంటూ అభినందించారు. కాంస్యం గెలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్.. ఈ పతకం ఎంతో ప్రత్యేకమన్నారు. ఒలింపిక్స్లో ఇప్పటివరకు భారత్కు షూటింగ్ కేటగిరిలో పతకం అందించిన తొలి మహిళగా మను భకర్ అవతరించిగా.. నిజంగా ఇది అద్భుతమైన ఘనత అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
చంద్రబాబు..
” ఒలింపిక్స్ లో షూటింగ్ క్రీడలో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళగా అవతరించినందుకు మను బాకర్ కు శుభాభినందనలు. అంతేకాదు, మను బాకర్ సాధించిన కాంస్యం పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం” అని సీఎం చంద్రబాబు ప్రశంసించారు .
మంత్రి నారా లోకేశ్ కూడా ….
“పారిస్ ఒలింపిక్ క్రీడల్లో మన దేశానికి తొలి పతకం అందించిన మను బాకర్ కు అభినందనలు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్రీడాంశంలో మను బాకర్ సాధించిన కాంస్యం స్ఫూర్తిగా మన క్రీడాకారులు ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను” అని నారా లోకేశ్ పేర్కొన్నారు.