Tuesday, September 17, 2024

TG | డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి

హైదరాబాద్: రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు వాటిని తట్టుకుని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించడానికి, ఆకస్మికంగా ఎదురయ్యే పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా విపత్తుల నిర్వహణ వ్యవస్థను (డిజాస్టర్ మేనేజ్మెంట్) బలోపేతం చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

ఈరోజు (గురువారం) సచివాలయంలోని తన కార్యాలయంలో వరద కార్యాచరణ ప్రణాళికపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఎస్ హరీష్, జాయింట్ సెక్రెటరీ, రెవెన్యూ (విపత్తు నిర్వహణ), హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10 సంవత్సరాల తర్వాత తొలిసారిగా వరదలపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. వరదలతో సంబంధం ఉన్న ప్రతి విభాగం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వరదలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో వరద ముప్పును తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు.

రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ తరపున ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.వరదలు, కాలువలు, చిన్న డ్రైనేజీలనుంచి మొదలుకుని, హైరైజ్ భవనాల వరకు ఏ పరిస్థితి ఎదురైనా దానిని అధిగమించడానికి వీలుగా అధునాతన పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అన్నీ విభాగాలు వరద ముప్పును ఎదుర్కోవడానికి కావలసిన ప్రణాళికలను సిద్ధం చేసుకుని రావాలని త్వరలో దీనిపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. హైడ్రా పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు.

- Advertisement -

గతంలో 30 బృందాలు ఉండగా దాన్ని 70 కి పెంచామని అలాగే సిబ్బంది సంఖ్యను 1800 నుండి 3500 వరకు పెంచడం జరిగిందని వివరించారు. దీనిపై మంత్రిగారు స్పందిస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించి హైడ్రాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హైడ్రాకు కావలిసిన అధునాతన పరికరాలు అందిస్తామని ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని హైడ్రా కమిషనర్ కి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement