Thursday, September 19, 2024

TG | ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం : డిప్యూటీ సీఎం భట్టి

ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామంలో నేడు (బుధవారం) ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఎన్నికల ముందు ఏఐసిసి ఆదేశం మేరకు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేశాను.. సీఎల్పీ నేతగా నేను ఓవైపు.. నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోవైపు ఆదిలాబాద్ నుంచే యాత్రలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాం… ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారం కోసం కంకణ బద్ధులమై ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చామని తెలిపారు.

కాగా, అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ఏ ఒక్క హామీని మర్చిపోకుండా అమలు చేస్తున్నాం అన్నారు. నాడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి పేపర్ లీక్ లేకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు.

మొదటి సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. కొద్ది రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం. ఐదు లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తాం, ఎస్సీ ఎస్టీలకు అదనంగా లక్ష రూపాయలు జత చేసి ఇస్తున్నాం. ఇది ప్రజల ప్రభుత్వ అని.. వచ్చే ప్రతి రూపాయి కూడా దుబారా కాకుండా అర్థవంతంగా ప్రజలకే ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

ఇక‌ డ్వాక్రా సంఘాల ద్వారా వారి స్థితిగతులను మార్చే పనులు చేపడతామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ లో గతంలో కొనసాగిన పథకాలను పునరుద్ధరిస్తాం, అందుకు తాజా బడ్జెట్లో 35 వేల కోట్లకు పైబడి నిధులు కేటాయించినట్లు తెలిపారు. పాదయాత్ర సందర్భంగా బస చేసిన ప్రతి ప్రాంతాన్ని సందర్శిస్తానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు.

నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని, పోటీ పరీక్షలకు హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు పోకుండా నియోజకవర్గ, కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్లను త్వరలో ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో 400 కోట్లు కేటాయించామన్నారు. సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement