Tuesday, October 22, 2024

TG | నిరుద్యోగుల సమస్యలు తీర్చాలి.. ప్రభుత్వానికి హరీశ్‌రావు లేఖ..

కాంగ్రెస్‌ను నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అలమటించాల్సిన పరిస్థితి తెచ్చారని బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.

కాంగ్రెస్‌ను నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండానే కేబినెట్‌ సమావేశాన్ని ముగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధ్యతగల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉద్యోగార్థులకు సంబంధించిన కొన్ని కీలకమైన సమస్యలను, బాధలను, వినతులను మీ దృష్టికి తీసుకొస్తున్నామని అన్నారు. వెంటనే ఈ అంశాలపై దృష్టిపెట్టి తగు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏడు విజ్ఞప్తులు చేశారు.

హరీశ్‌రావు లేఖలోని ఏడు డిమాండ్లు..

  • గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. మీరు వాటికి మరో అరవై ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేసారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మెయిన్స్‌కు 1 : 50 నిష్పత్తిలో కాకుండా, 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరుతున్నాను.

  • గ్రూప్ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ 3 కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని మీరు మాట ఇచ్చారు. ఆ మాటను నిలుపుకోవాలని కోరుతున్నాను.

- Advertisement -
  • పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. జూలై చివరి వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష ఉంది. ఏడు రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నందున అభ్యర్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు. కాబట్టి ఉద్యోగ నియామకాల పరీక్షల తేదీల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

  • ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాదిలోగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి తదనుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేయాలని, కోరుతున్నాను.

  • అధికారం లోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మొదటి క్యాబినెట్‌లోనే నిర్ణయం తీసుకుంటామని మేనిఫెస్టోలో ఘనంగా ప్రకటించారు. 25 వేల టీచర్ పోస్టులలో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా 11 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారు. మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే విధంగా మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతున్నాను .

  • అదే విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకున్న బకాయీ మొత్తం సహా నిరుద్యోగ భృతిని నెలనెలా చెల్లించాలని కోరుతున్నాను.

  • కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చినంక వారిని నట్టేటముంచి జి.వో 46ప్రకారమే నియామక ప్రక్రియ పూర్తిచేశారు. ప్రభుత్వం వెంటనే జీవో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాము.

నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన వాగ్దానాలను గుర్తుచేసేందుకు, తద్వారా వారి ప్రయోజనాలను కాపాడేందుకు నేను రాసిన ఈ లేఖను సహృదయంతో అర్థం చేసుకొని వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తారని నమ్ముతున్నాను అని లేఖలో పేర్కోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement