Monday, September 23, 2024

TG | ప్రమాదరహిత రహదారులుగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి

ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అధునాతన రోడ్డు నిర్మాణ పద్ధతులను తెలంగాణలోనూ అమలు చేస్తామని.. అందుకోసం స్మార్ట్ రోడ్ టెక్నాలజీ, ఇంటలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్, ఫ్యూచరిస్టిక్ ఆటోమేటెడ్ కన్ స్ట్రక్షన్, ఐసీటీ వంటి అధునాతన పద్ధతులను రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

సోమవారం సచివాలయంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో సమావేశమైన మంత్రి.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ప్రపంచబ్యాంక్ రవాణారంగ ప్రధాన అధికారిణి రీనూ అనుజా.. ప్రపంచబ్యాంకు సహకారంతో మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రోడ్ల నిర్మాణాలు, వాటి తీరుతెన్నులపై పీపీటీ రూపంలో మంత్రికి వివరించారు.

తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమబెంగాళ్ వంటి రాష్ట్రాల్లో ఐసీటీ (“ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ”) సాంకేతికతను ఉపయోగించి రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించారు, ఎంతశాతం మరణాల రేటు తగ్గిందన్న విషయాలను గణాంకాలతో సహవివరించారు. అంతేకాదు, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఆధారిత విధానాన్ని అనుసరించడం వల్ల ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విజన్ కు అనుగుణంగా అర్భన్ ఏరియాలను.. రుర్బన్ కు విస్తరించడం, మెగా క్లస్టర్స్ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలను నగరాలతో అనుసంధానించడం, విమెన్ స్కిల్లింగ్ హబ్స్ ఏర్పాటు వంటి నూతన విధానాలను రూపొందించడం ద్వారా రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయవచ్చని తన ప్రజెంటేషన్ లో వివరించారు.

మరోవైపు రాష్ట్రంలో ఇన్నోవేటివ్ ఫైనాన్స్ మోడల్ ద్వారా ఆర్ధిక సహకారం అందించేందుకు అనువైన ప్రాజెక్టుల గురించి రీనూ అనుజా మంత్రికి వివరించారు. అనంతరం మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వందలాది మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నప్పటికి గత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించలేదని.. దానివల్ల ఎందరో అమాయకులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు.

- Advertisement -

గత ప్రభుత్వం పదేండ్లలో రోడ్డు భద్రతా ప్రమాణాలు ఏ మాత్రం పాటించలేదని, ప్రమాద బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు కనీసం ట్రామాకేర్ సెంటర్స్ ను కూడా నిర్మించలేదన్నారు. కానీ మేం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను గుర్తెరిగి.. అత్యంత ప్రమాదకరంగా ఉన్న హైవేలపై ట్రామాకేర్ సెంటర్స్ ను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని.. ఇప్పటికే హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై ట్రామాకేర్ సెంటర్ నిర్మాణంలో ఉందని తెలిపారు.

తెలంగాణలో నిర్మిస్తున్న రహదారుల నిర్మాణంలో వరల్డ్ రోడ్డు కాంగ్రెస్ నిర్ధేశిత ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు సహకారంపై ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. మాకు ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని.. ప్రత్యేక ప్రణాళికలతో వస్తే.. మరోసారి సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు మంత్రి వివరించారు.

ఈ సమావేశంలో ఆర్&బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దాసరి హరిచందన, ఈఎన్సీ మధుసూధన్ రెడ్డి తో పాటు శాఖకు సంబంధించిన సీఈలు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement