జన్నారం, (ప్రభ న్యూస్): అభయారణ్యం ఎంతో బాగు అని ట్రైనీ ఐఏఎస్ లు అటవీ అందాలను తిలకించి మనోభావాలను వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలోని ఇందన్ పల్లి, తాళ్లపేట, జన్నారం రేంజులలోని అటవీ అందాలను శుక్రవారం వీక్షించారు.
2023 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ ఉమహరితి ఎన్, అజ్మీరా సంకేత్ కుమార్, గరిమా నరులా, అభిజ్ఞ మాల్వియా, అజయ్ యాదవ్, ఎం.శేస్త, ఐ.ఇ. ఎస్ఎస్డీ మనోజ్ శిక్షణలో భాగంగా ఉదయం ఇక్కడికి వచ్చి.. జన్నారం డివిజన్ అటవీ ప్రాంతంలోని గనిశెట్టికుంట, మైసమ్మకుంట, సోలార్ పీటీ, కామన్ పల్లి వాచ్ టవర్స్, బైసన్ కుంట, మంచెలు, పచ్చి గడ్డి పెంపకం కేంద్రాలు, వన్యప్రాణులను చూసేందుకు సఫారీకి వెళ్లారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవి అందాలను మరువలేమన్నారు. అడవుల్లో పర్యటించినంత సేపు సమయం తెలియలేదని వారు చెప్పారు. ఈ ప్రాంతానికి మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి వెంట ఎండీ హఫీజుద్దీన్, సుష్మారావు, డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి, సెక్షన్, బిట్ అధికారులు తదితరులు ఉన్నారు.