Friday, October 18, 2024

TG | త్వరలో తెలంగాణ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్ : సీఎస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : త్వరలో వినూత్న పద్దతులతో తెలంగాణ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ను అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి తెలిపారు. అధికారులు సమన్వయంతో సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీఎస్ శాంతికుమారి మంగళవారం సచివాలయంలో డీజీపీ జితేందర్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించారు.

ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన ఘటనల నేపథ్యంలో అగ్నిమాపక శాఖకు చెందిన 10 బృందాలు, తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌లోని 10 కంపెనీలను వినియోగించి తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సుమారు 2000 మందితో కూడిన బలమైన బలగాలను ఏర్పాటు చేసెందుకు, అవసరమైన బడ్జెట్‌ కూడా సీఎం రేవంత్‌రెడ్డి మంజూరు చేశారని సీఎస్‌ తెలిపారు.

వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. వచ్చేనెల మొదటి వారం నుంచి సిబ్బందికి మొదటి బ్యాచ్‌ శిక్షణను ప్రారంభించాలని ఆమె తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లకు అవసరమైన వాహనాలు, రెస్క్యూ పరికరాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇతర సాధనాల సేకరణ గురించి కూడా సమావేశంలో చర్చించారు.

అవసరమైన పరికరాలు, శిక్షణ అందించడం ద్వారా అగ్నిమాపక శాఖలోని 10 బృందాలను ఎస్‌డిఆర్‌ఎఫ్‌ స్టేషన్‌లుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు డిజి ఫైర్‌ సర్వీసెస్‌ నాగి రెడ్డి తెలిపారు. అదేవిధంగా టీజీఎస్పీ బెటాలియన్‌ల నుండి మొత్తం 1000 మంది సిబ్బంది (ఒక్కో సంస్థ 100 మంది సిబ్బందితో కూడినది) అగ్నిమాపక శాఖ సిబ్బందితో సమానంగా శిక్షణ పొందుతారన్నారు. ఈ బృందాలను అత్యవసర పరిస్థితిలో సంబంధిత ప్రదేశాలలో అందుబాటులో ఉంచబడతారని చెప్పారు. శిక్షణ కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సేవలను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement