Friday, September 27, 2024

TG – రేపు హైద‌రాబాద్ రానున్న రాష్ట్ర‌ప‌తి ముర్ము

న‌ల్సార్‌ స్నాత‌కోత్స‌వానికి హాజ‌రు
సిటీలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు
ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను స‌మీక్షించిన కలెక్ట‌ర్
ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్ వివ‌రాలు వెల్ల‌డించిన అడిష‌న‌ల్ సీపీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:
భార‌త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ‌నివారం హైద‌రాబాద్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్‌, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి శుక్ర‌వారం సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన 8 రాష్ట్రాల‌కు సంబంధించిన స్టాళ్లను, నాలుగు ఫుడ్‌ కోర్టులు, మీడియా సెంటర్‌, ఇతర స్టాళ్లను పరిశీలించారు.

ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా శనివారం హైద‌రాబాద్ నగరంలోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ విశ్వప్రసాద్‌ తెలిపారు. శ‌నివారం ఉదయం 9 గంటల నుంచి బేగంపేట , హెచ్‌పీఎస్‌, పీఎన్‌టీ జంక్షన్‌, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, తివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులుంటాయని స్ప‌ష్టం చేశారు.

నల్సార్ స్నాతకోత్సవం లో ప్రెసిడెంట్ ..

శామీర్‌పేట లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయలో శ‌నివారం జ‌రిగే 21వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు. గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, నల్సార్‌ చాన్స్‌లర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నర్సింహులు విచ్చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ వీసీ క్రిష్ణదేవరావ్ మీడియాకు వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement