Monday, October 21, 2024

TG | నిఘా నీడలో మెయిన్స్.. తొలిసారి జీపీఎస్ ట్రాకింగ్ విధానం అమలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్: గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలకు టీజీపీఎస్సీ రెడీ అయ్యింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులందరి బయోమెట్రిక్‌ తీసుకోనుండగా కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రం తరలించే వాహనానికి తొలిసారిగా జీపీఎస్​ వినియోగించనున్నారు. మెయిన్స్ పరీక్ష వాయిదా కోసం ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -

హాజరుకానున్న 31,383 మంది అభ్యర్థులు

రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో 46 పరీక్ష కేంద్రాల్లో 31,383 మంది హాజరు కానున్నారు. హైదరాబాద్‌లో 8, రంగారెడ్డిలో 11, మేడ్చల్ జిల్లాలో 27 కేంద్రాలను ఏర్పాటు చేసింది. అభ్యర్ధుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకు టీజీపీఎస్సీ ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తోంది. పరీక్ష గది, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించనుంది. ఈనెల 21 నుంచి 27వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు నగర పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనలు తారస్థాయికి చేరడంతో పశ్నపత్రాల తరలింపు, పరీక్ష నిర్వహణ, తిరిగి జవాబు పత్రాలు తీసుకెళ్లడం వరకు ఎలాంటి ఆటంకం లేకుండా గట్టి పోలీసు బందోబస్తు కల్పించాలని నిర్ణయించారు. ప్రతీ కేంద్రం వద్ద ఒక ఎస్​.ఐతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్‌ విధుల్లో ఉంటారు. అదనంగా ఒక పోలీస్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పరీక్షా కేంద్రాలను తరచూ సందర్శిస్తుంది. స్థానిక ఇన్‌స్పెక్టర్, ఏసీపీ పరీక్షా కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తుంటారు. భద్రతా పరమైన ఏర్పాట్ల పర్యవేక్షణకు మూడు కమిషనరేట్లలో ఒక్కో డీసీపీని నోడల్‌ అధికారిగా నియమించారు.

తొలిసారిగా జీపీఎస్​ ట్రాకింగ్‌ వ్యవస్థ

ప్రశ్నపత్రాలు, జవాబు తరలించే వాహనాలకు టీజీపీఎస్సీ తొలిసారిగా జీపీఎస్​ ట్రాకింగ్‌ వ్యవస్థ ఉపయోగిస్తోంది. స్ట్రాంగ్‌ రూముల నుంచి పరీక్ష కేంద్రానికి తరలించే వాహనాలకు జీపీఎస్​ అమర్చి టీజీపీఎస్సీ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. వాహనం ఒక్కనిమిషం ఆగినా వెంటనే గుర్తించి అప్రమత్తం చేసేలా ఏర్పాట్లు చేశారు. గ్రూప్‌-1 పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జిరాక్స్‌, ఇంటర్‌నెట్‌ దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. వాచీలు, కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్, బ్లూటూత్‌ తదితర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు అనుమతి లేదు. మంగళసూత్రం, గాజులు మినహా ఆభరణాలను తేనివ్వరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement