Sunday, September 22, 2024

TG | రుజువు చేస్తే రాజీనామా చేస్తా… మంత్రి పొంగులేటి స‌వాల్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేటీఆర్‌ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామని, చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. శనివారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమృత్ టెండర్లలో ఎటువంటి అవినీతి జరగలేదన్నారు.

‘అమృత్ టెండర్లలో అవినీతి జరగలేదు. రూ.వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ కేటీఆర్‌ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేస్తామన్నారు. ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

అమృత్‌ పథకంలో రూ. 8888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్‌ నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని చెప్పారు. ఒకవేళ కేటీఆర్‌ ఆ ఆరోపణలను నిరూపించకుంటే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తన సవాలును కేటీఆర్‌ స్వీకరిస్తే సెప్టెంబర్‌ 22న ఉదయం ఎక్కడికైనా వస్తానని చెప్పారు.

స్పీకర్‌ పార్మాట్లో ఇద్దరం రాజీనామా చేద్దాం అంటూ కేటీఆర్‌కు సూచించారు. టెండర్లను గత ప్రభుత్వమే రూ.3616 కోట్ల చొప్పున 3 ప్యాకేజీలకు పిలిచిందన్నారు. పోలింగ్‌ తేదీకి ఒక్క రోజు ముందే టెండర్‌లను కట్టబెట్టిందని ఆరోపించారు. టెండర్లలో సోదా కంపెనీ సృజన్‌రెడ్డి ఒక టెండర్‌ దక్కించుకున్నారని చెప్పారు.

టెండర్లు వేయొద్దని ఏ కంపెనీని బెదిరించలేదన్నారు. తామే పిలిచిన రీ టెండర్లలో గతంలో కంటే రూ. 54 కోట్లు తక్కువకే బిడ్స్‌ వచ్చాయన్నారు. ప్రతిపక్ష హోదా అయినా ఉండాలంటే ఆధారాలతో మాట్లాడాలని హితవు పలికారు. మిషన్‌ భగీరథలో రూ. 39 వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు.

- Advertisement -

బీఎల్‌ఆర్‌, మెగా, గజా కంపెనీలకు ఆనాటి ప్రభుత్వం రూ. 3,516 కోట్ల అంచనా టెండర్లు 3.99 శాతం ఎక్కువకు 2022-23లో ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఆ మూడు టెండర్లు ఎక్సెస్‌ ఉన్నాయని మేం గుర్తించాం. నిబంధనలకు తగినట్టుగా రీకాల్‌ చేయాలని సీఎం ఆదేశించారు’ అంటూ మంత్రి పొంగులేటి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement