Sunday, October 20, 2024

బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలు రూట్‌మ్యాప్‌లో తెలుగు రాష్ట్రాలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలోని వివిధ బౌద్ధ క్షేత్రాలను కలుపుతూ ప్రయాణించే బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలు మార్గంలో తెలుగు రాష్ట్రాల్లో బౌద్ధ క్షేత్రాలను కూడా కలుపుతామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని సప్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ వద్ద ‘రామాయణ్ యాత్ర’ – భారత్ గౌరవ్ ట్రైన్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. తాను పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికే బుద్ధిస్ట్ సర్క్యూట్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారని, అయితే తెలుగు రాష్ట్రాల్లో బౌద్ధ క్షేత్రాలను ఆ రైలుమార్గంలో కలపాలన్న ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు.

వాటిని అనుసరించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రామాయణ్ యాత్ర రైలును ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. ఈ రైలు ఉత్తర-దక్షిణ భారతదేశాన్నిమాత్రమే కాదు, భారత్-నేపాల్ దేశాలను కూడా కలుపుతుందని వెల్లడించారు. మొత్తం 18 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో చివరిగా దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన తెలంగాణలోని భద్రాచలం చేరుకుంటుందని, ఆ తర్వాత ఢిల్లీకి చేరుకోవడంతో ప్రయాణం ముగుస్తుందని తెలిపారు.

అంతకంటే ముందు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి కిషన్ రెడ్డి పచ్చ జెండా ఊపి ఈ రైలు యాత్రను ప్రారంభించారు. భారత్ – నేపాల్ మధ్యన నడిచే మొట్టమొదటి పర్యాటక రైలుగా ఇది రికార్డుల్లోకి ఎక్కనుంది. భారత్ గౌరవ్ రైళ్ల పేరుతో దేశవ్యాప్తంగా 3,500 కోచ్‌లతో పర్యాటక రైళ్లను భారత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14 వ తేదీన “షిర్డీ యాత్ర” పేరిట మొట్టమొదటి భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభమైంది. తాజాగా శ్రీరాముడు జన్మించిన నేలను మొదలుకొని ఆయన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ‘శ్రీ రామాయణ యాత్ర’ పేరిట భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభమైంది.

మొత్తం 18 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమై అయోధ్య, బక్సర్, సీతామర్హి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ్ రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం, కాంచీపురం, భద్రాచలం వంటి వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి ఢిల్లీ చేరుకోవడంతో ముగుస్తుంది. యాత్ర పొడవునా యాత్రికులకు అవసరమైన భోజన, వసతి సదుపాయాలు, ప్రయాణ ఇన్సూరెన్స్, సెక్యూరిటీ, టూరిస్టు గైడ్స్ వంటి సదుపాయాలుంటాయి. ఈ రైలులో మొత్తం 14 కోచ్ లు ఉంటాయి. 600 మంది సామర్థ్యం కలిగిన ఈ రైలు మొదటి ప్రయాణం 500 మంది యాత్రికులతో మొదలైంది. కోచ్‌లన్నీ కూడా 3 టైర్ ఏసీ సౌకర్యంతో యాత్రకు అనుగుణంగా ప్రత్యేక మార్పులతో రూపొందాయి. అవసరమైన చోట సమీప హోటళ్లలోని ఏసీ గదుల్లో బస ఏర్పాటు చేశారు.

రైలు బయటి వైపున సుసంపన్నమైన భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేటటువంటి వివిధ చిత్రాలను, పురాతన కట్టడాలు, ఆలయాలు, నృత్య రూపాలు, వంటకాలు, వస్త్రధారణ, యుద్ధ కళలు, జానపద కళలకు సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని శతాబ్దాల కాలం క్రితం సారనాథ్‌లో నిర్మించిన ధమేక్ స్తూపం మొదలుకొని ఇటీవలే న్యూఢిల్లీలో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ వరకు వివిధ కట్టడాలను ప్రదర్శిస్తూ రైలుపై ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా ఈశాన్య రాష్ట్రాలు, కేరళకు సంబంధించిన యుద్ధ విద్యలను ప్రదర్శించారు. అలాగే వైవిధ్యమైన గొప్ప నిర్మాణాలను తెలియజేసే త్రిపురలోని నీర్ మహల్, ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి ఆలయంలో ఉన్న నంది విగ్రహం, న్యూఢిల్లీలోని ఆధునిక లోటస్ టెంపుల్ వంటి స్మారక కట్టడాలను కూడా ప్రదర్శించారు.

- Advertisement -

దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనలకు అనుగుణంగా భారతీయ రైల్వే, ఐఆర్‌సీటీసీతో కలిసి వివిధ చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక, ఆధ్యాత్మిక నేపథ్యాలను ఎంచుకొని కొన్ని ప్రత్యేక రైళ్ళను పర్యాటకులు, యాత్రికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా దేశంలోని అనేక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను రూపొందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement