Thursday, September 19, 2024

Telangana – వరద సాయంలో కేంద్రం గుండు సున్నా

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:వరదలు మిగిల్చిన నష్టం నుంచి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. కేంద్ర పెద్దలెవరూ సాయంపై నోరు మెదపడం లేదు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. కానీ, తెలంగాణకు ఒరిగిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు కొట్టిన డైలాగులు ఎక్కడికి పోయాయో.. ఎవరికీ అర్థం కావడం లేదని చాలామంది రాజ‌కీయ నాయ‌కులు అంటున్నారు.కిష‌న్‌రెడ్డి అభ‌య‌మేమైంది..అన్నింటికీ మించి తెలంగాణ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. ఇక వీరంతా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. వీరితో పాటు బీజేపీ ఎంపీల బృందాలు పర్యటించాయి. ఖమ్మం జిల్లాలో వరద ముంపున‌కు గురైన ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించి.. రాకాసితండాలో వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని అభయమిచ్చారు.

పంట‌పొలాల్లో ఇసుక మేట‌లు..ముందుగా.. పంట పొలాల్లో ఇసుక మేటను తొలగిస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగిన ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతే ఇక్కడితో వారి ప‌రామ‌ర్శ‌లు, ప‌ర్య‌ట‌న‌లు ఆగిపోయాయ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

. ‘‘వచ్చారు.. చూశారు.. వెళ్లారు.’’ అనే కాన్సెప్ట్లోనే కేంద్ర మంత్రుల పర్యటన సాగిందనే విమర్శలు ఉన్నాయి. కనీసం వీరెవరూ కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడి నిధులు రప్పించే ప్రయత్నాలు చేయడం లేదనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.ఆ హామీలు..

ఢిల్లీ దాకా వెళ్ల‌లేదా?

వరదల కారణంగా తెలంగాణకు ₹5,348 కోట్ల మేర నష్టం జరిగిందని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్గా ప్రకటించారు. అంతేకాకాకుండా.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో జరిగిన భేటీలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలంగాణకు హామీ ఇచ్చారు. కట్ చేస్తే.. ఫలితం మాత్రం శూన్యం.

ఆయన హైదరాబాద్ నుంచి ఫ్లయిట్ ఎక్కి, అన్నీ ఇక్కడే మరిచిపోయారని, ఢిల్లీ వరకు తీసుకెళ్లలేదనే విమర్శలు పెరుగుతున్నాయి.

అక్క‌డి వారే ప్ర‌జ‌లా..

గతంలో కూడా తెలంగాణకు భారీ వరదలు వచ్చాయి. అప్పుడు హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందలేదనే వాదనలు కూడా ఉన్నాయి. అదే గుజరాత్లో విపత్తు వంటివి తలెత్తితే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్లి, కోట్ల రూపాయలు కుమ్మరిస్తారనే సూటిపోటి మాటలు కూడా రాజకీయ నాయకుల నోటి నుంచి వస్తున్నాయి. ‘‘అక్కడి వారే ప్రజలు, ఇక్కడి వారు కారా?’’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వరదలకు తెలంగాణలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కలిగింది. ఎంతోమంది పేదలు నిరాశ్రయులయ్యారు. వారందరికీ పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే కేంద్రం ఏదో మొక్కుబడి తంతుగా విదిలిస్తే సరిపోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అట్లైతే ఊరుకోం..

పక్కనే ఉన్న మరో ఏపీకి ఎక్కువ నిధులిచ్చి, తెలంగాణకు తక్కువ ఇచ్చినా ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా చేస్తే.. తెలంగాణ ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత మరింత పెరుగుతుందని, ఇది పార్టీకే తీరని నష్టమని సీనియర్ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నింటికీ మించి గొప్ప విషయం ఏమిటంటే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాక్షేమం కోసం ఒక మెట్టు దిగి పార్టీలు వేరేనా ప్రజల కోసం పార్టీలకతీతంగా పనిచేద్దామని ముందడుగు వేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement