Wednesday, October 9, 2024

TG | హైదరాబాద్‌లో తైవాన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అంతర్జాతీయ పెట్టుబడులు, బహుళజాతి సంస్థల ప్రాంతీయ కార్యాలయాలు నెలకొల్పడంతో ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని పొందిన హైదరాబాద్‌ మహానగరంలో తైవాన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ నెలకొల్పుతామని ఆ దేశ ప్రతినిధి బృందం ప్రత్యేక ఆసక్తితో ముందకు వచ్చింది.

తైవాన్‌ నుంచి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా తెలంగాణా ఐటీ, పరిశ్రమల శాఖ, తైవాన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంస్థలు (టీసీసీ) ద్వైపాక్షిక సహకార ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంవల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుంది.

మంగళవారం నాడు రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఐఐజీ) కార్యాలయంలో ప్రభుత్వ స్పెషల్‌ సెక్రటరీ విష్ణవర్ధన్‌ రెడ్డి, టీసీసీ ఉపాధ్యక్షుడు సైమన్‌ లీ మధ్య ఈ ఎంఓయూ జరిగింది. తైవాన్‌ నుంచి పెట్టుబడులను రాబట్టేందుకు టీసీసీ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనుంది.

తైవాన్‌ కంపెనీలు రాష్ట్రంలోకి ప్రవేశించడంలో టీసీసీ కీలక మాధ్యమంగా నిలుస్తుంది. హైదరాబాద్‌లో తైవాన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు కోసం ఇప్పటికే రూపకల్పన జరిగింది. మార్కెట్‌ ఎంట్రీ అధ్యయనాలు, పెట్టు-బడిదారులతో సమావేశాలు నిర్వహిచడం, తెలంగాణాను అంతర్జాతీయంగా ప్రమోట్‌ చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులతోపాటు అధ్యయన కేంద్రాలు నెలకొల్పడానికి అనేక దేశాల నుంచి సుముఖత వ్యక్తమవుతోందని తెలిపారు. ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు.. భౌగోళిన వనరులు, అంతర్జాతీయ రవాణా సైకర్యం..

- Advertisement -

అన్నింటికీ మించి అత్యంత చౌకగా దొరికే ఉన్నతశ్రేణి మానవ వనరులు తెలంగాణ ప్రత్యేకత అని, అందుకే పేరుగాంచిన బహుళజాతి సంస్థలు సైతం హైదరాబాద్‌ వైపు దూస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా – తైపీ అసోసియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ మన్హర్‌ సింగ్‌ యాదవ్‌ కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement