Tuesday, October 8, 2024

Statement – అనుచిత వ్యాఖ్యల‌తో మా కుటుంబ ప‌రువు తీశారు …. నాగార్జున

హైద‌రాబాద్ – సీని జంట‌ అక్కినేని నాగచైతన్య , సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య లను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టింది. చివరకు కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు నాగార్జున. క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు నాంపల్లి కోర్టులో పిటిషన్ విచారణ జరిగింది. ప్రొసిజర్ ప్రకారం పిటిషనర్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. నాగార్జున స్టేట్‌మెంట్‌ తర్వాత సాక్షుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది. కోర్టుకు నాగార్జునతో పాటు భార్య అమల, కుమారుడు నాగ చైతన్య, సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు, సుశాంత్ తల్లి, నాగార్జున సోదరి నాగసుశీల హాజరయ్యారు.

నాగార్జున వాంగ్మూలం ఇదే..

‘‘సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ఆధారాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా కుమారుడు విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణం అని మంత్రి అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడం వల్ల మా పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతో మంత్రి ఇలాంటి వాఖ్యలు చేశారు. ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్న తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానెల్స్‌లో ప్రసారం చేశాయి. అన్ని పేపర్స్ ప్రచురితం చేశాయి. దీని వల్ల మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. దేశ వ్యాప్తంగా మా కుటుంబంపై తీవ్ర ప్రభావం పడింది. ఇలా మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల మా కుటుంబానికి నష్టం జరిగింది. మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది’’ అంటూ కోర్టుకు నాగార్జున స్టేట్‌మెంట్ ఇచ్చారు.

- Advertisement -

సాక్షిగా సుప్రియ …

నాగార్జున స్టేట్‌మెంట్ పూర్తి అయిన తరువాత సాక్షిగా సుప్రియ స్టేట్‌మెంట్‌ను కోర్టు నమోదు చేసుకుంది. ‘‘కేటీఆర్ వల్ల నాగ చైతన్య, సమంత విడాకులు జరిగాయని అని మంత్రి మాట్లాడారు.. ఎన్‌ కన్వెన్షన్ విషయంలో సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించమంటే సమంత ఒప్పుకోలేదు. అందుకే విడాకులు తీసుకుందని మంత్రి మాట్లాడారు. దీంతో మా కుటుంబం మొత్తం షాక్ నకు గురైంది. ఈ విధంగా మంత్రి మా కుటుంబంపై ఎందుకు మాట్లాడిందో అర్థం కాలేదు. దాంతో మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. మంత్రి చేసిన వ్యాఖ్యలు నేను కొన్ని మీడియా చానెళ్లలో చూశా. నేషనల్ మీడియాలో కూడా ఈ వార్త విన్నాను. మరుసటి రోజు పేపర్లో కూడా వార్త వచ్చింది. దీని వల్ల మా కుటుంబం తీవ్రమైనోవేదనకు గురైంది’’ అంటూ సుప్రియ వాంగ్మూలం ఇచ్చారు. విచారణ ముగిసిన అనంతరం నాగార్జున కుటుంబం కోర్టు నుంచి వెళ్లిపోయింది. కేవలం సుప్రియ స్టేట్‌మెంట్‌ను మాత్రమే న్యాయస్థానం రికార్డ్ చేసింది. 10వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది. ఆ రోజు మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement