Sunday, October 6, 2024

TG | ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్‌ వర్శిటీ.. : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి, వారి ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వడంతోపాటు భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఇకపై ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ విద్యార్థులకు స్వయం ఉపాధి రంగంలో మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టిందని వివరించారు.

అందుకోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఒకటి, రెండు రోజుల ముందే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలన్నారు.

అధికారులతోపాటు పారిశ్రామికరంగ ప్రముఖుల భాగస్వామ్యంతో అధ్యయనం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని, ఆ దిశగా లోతైన కసరత్తు జరగాలని సీఎం ఆకాంక్షించారు. నివేదిక అందిన తర్వాత ఆ ప్రతిపాదనలను పరిశీలించి 24 నాలుగు గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌సీఐ)లో స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటు అంశంపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

- Advertisement -

అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటీకీ అందుబాటులో ఉన్నందున ఈ సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకున్న అవకాశాలు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఈ సమావేశంలో భాగంగా చర్చ జరిగింది.

అప్పటి వరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. స్కిల్‌ యూనివర్సిటీలో ఏయే కోర్సులుండాలి, ఎలాంటి కరిక్యులమ్‌ ఉండాలి.. అనే అంశంపై నిపుణుల అభిప్రాయం తెలుసుకుని ముందడుగు వేయాలన్నారు.

అటు విస్తరిస్తున్న పారిశ్రామిక రంగంలో అధునాతన ఒరవడి సృష్టించేందుకు ఓ కొత్త ప్రయత్నం మొదలు పెట్టాలన్నారు. పరిశ్రమల అవసరాలు తెలుసుకొని, వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేందుకు ఏయే నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలనేది ముందుగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.

అధునాతన పరిజ్ఞానం అందించేలా ఈ స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులమ్‌, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించాలని చెప్పారు.

నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించాలని, కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతి అయిదు రోజులకోసారి సమావేశం కావాలని సీఎం రేవంత్‌ ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలా.. ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టాలా… మరేదైనా విధానం అనుసరించాలా.. అనేది కూడా పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని అధికారులతో సీఎం చెప్పారు. యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్‌ డిపార్టుమెంట్‌గా ఉంటుందని సీఎం ప్రకటించారు. ఏఏ విభాగాల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తే.. భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రధాన్యతలు ఖరారు చేయాలన్నారు.

ఈఎస్‌సీఐ వనరులను పరిశీలించిన సీఎం..

సమావేశానికి ముందు ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు కలియ తిరిగి అందులో ఉండే సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో స్టాఫ్‌ కాలేజీ అక్ష్యాలు, ఉద్దేశాలు, సాధించిన విజయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్‌ సెక్రెటరీ అజిత్‌ రెడ్డి, విష్ణువర్దన్‌ రెడ్డి, డాక్టర్‌ రెడ్డిస్‌ ల్యాబ్‌ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి, భారత్‌ బయోటెక్‌ హరిప్రసాద్‌, క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌ రెడ్డి, ఐ ల్యాబ్స్‌ శ్రీనిరాజు అదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement