Friday, October 18, 2024

Denmark Open | సింధు శుభారంభం..

డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజయంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లగా.. లక్ష్యసేన్‌, ఆకర్శి కశ్యప్‌, మాళవిక బన్సోద్‌ తదితరులు తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు.

మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో తెలుగుతేజం పీవీ సింధు 21-8, 13-7తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె ప్రత్యర్థి పై యు పొ (చైనీస్‌ తైపీ) గాయంతో ఆట మధ్యలోనే తప్పుకుంది. దీంతో సింధు నేరుగా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

ఇతర మ్యాచుల్లో ఆకర్శి కశ్యప్‌ 13-21, 12-21 తేడాతో 7వ సీడ్‌ సుపనిద కాటెట్‌హోగ్‌ (థైలాండ్‌) చేతిలో వరుస గేముల్లో చిత్తాయింది. మాళవిక బన్సోద్‌ కూడా 13-21, 12-21తో వియాత్నం షట్లర్‌ తుయి లిన్‌ ఎంగుయెన్‌ చేతిలో ఓడిపోయింది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో భారత స్టార్‌ లక్ష్యసేన్‌ 21-12, 19-21, 14-21తో చైనాకు చెందిన లూ గువాంగ్‌ జుపై పోరాడి ఓడాడు. తొలి గేమ్‌ను సునయాసంగా గెలిచిన సేన్‌.. తర్వాత రెండో గేమ్‌లో చివరి వరకూ పోరాడాడు. కానీ నిర్ణయాత్మకమైన ఆఖరి గేమ్‌లో మాత్రం తేలిపోవడంతో అతడికి ఓటమితప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement