ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న సైనక చర్యకు దౌత్యంతోనే ముగింపు పలకవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. రష్యాతో జరుగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులతోపాటు దేశ ప్రజలు వీరోచిత పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఆ పోరాటంతోనే మాస్కో ఆక్రమించిన ఎన్నో ప్రాంతాలను ఉక్రెయిన్ తిరిగి సొంతం చేసుకుందని వివరించారు. నేషనల్ టీవీలో జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకుంటేనే ఈ సంక్లిష్ట పరిస్థితికి పరిష్కారం దొరుకుతుందన్నారు. మాస్కోతో కాల్పుల విరమణ లేదా ఇతర ఒప్పందాలు జరిగే అవకాశాలను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. డాన్బాస్ ప్రాంతంలో పోరు తీవ్రం కావడం, ఫిన్లాండ్కు రష్యా గ్యాస్ సరఫరా నిలిపివేయడం వంటి చర్యలపై స్పందిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే మరియుపూల్ నగరం రష్యా చేతికి దక్కడంతో… ఇప్పుడు క్రెవ్లిున్ దృష్టి లుహాన్స్క్ ప్రాంతంపైకి మళ్లించింది. డాన్బాస్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది.
”డాన్బాస్ ప్రాంతంలో పరిస్థితి అత్యంత కఠినంగా ఉంది. స్లోవియాన్స్క్, సివోరా డొనెట్స్క్ పై రష్యా సేనలు అత్యంత తీవ్రమైన దాడులు చేస్తున్నాయి” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. యుద్ధంలో కీలక సమయంలో రష్యాకు ఎటువంటి అవకాశం ఇచ్చినా… అది రెట్టింపు శక్తితో దాడి చేస్తుందని ఉక్రెయిన్కు చెందిన అధికారులు చెబుతున్నారు. యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణ ప్రకటించాలని ఇటీవల అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..