Thursday, September 26, 2024

TG | కాంగ్రెస్ ప్రచారంలో ‘అందరికీ అన్నీ’.. ఇప్పుడు ‘కొందరికే కొన్ని’ : కేటీఆర్‌

సీఎం అంటే కటింగ్ మాస్టరా…? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్కో పథకంలో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే మీ లక్ష్యమా..? సీఎం అనే పదానికి ఇదే కొత్త నిర్వచనమా? అంటూ సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డిని నిలదీశారు.

నాడు పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు.. ఇప్పుడు రూ.2లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు. రూ.39వేలకోట్లు.. ఇప్పుడు రూ.31వేలకోట్లకు కటింగ్‌ పెట్టి కుదించారన్నారు. పాసుబుక్కులు లేవనే నెపంతో లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించం అని అన్నారు. రేషన్ కార్డు సాకు చూపి లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించం అని అన్నారు.

ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి, శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. మొన్న లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారని… నిన్న 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు రూ.2లక్షల రుణమాఫీని కూడా ఎగొట్టేందుకు లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదన్నారు.

నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదని.. ఓట్ల పండగ ముగిసినా.. ఎకరానికి రూ.7500ల రైతుభరోసాకు అడ్రస్సే లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రచారంలో ‘అందరికీ అన్నీ’ అన్నారని.. అధికారంలోకి రాగానే ‘కొందరికే కొన్ని’ అంటూ కోతపెడుతున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై మాట తప్పినా.. మడమ తిప్పినా.. లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం.. పోరాటం చేస్తామంటూ ఆయన ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement