Wednesday, September 18, 2024

America Tour – రేవంత్ ప‌ర్య‌ట‌న‌లో కొన‌సాగుతున్న పెట్టుబ‌డులు ప్ర‌వాహం…

వివింట్ ఫార్మా రూ. 400 కోట్ల పెట్టుబడి
తెలంగాణ జీనోమ్ వ్యాలీలో ఇంజెక్టబుల్స్ కేంద్రం
వేయి మందికి ఉద్యోగ అవ‌కాశాలు..
హైద‌రాబాద్ లో చార్లెస్ స్క్వాబ్ కంపెనీ
అభివృద్ది సెంట‌ర్ ఏర్పాటుకు అంగీకారం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – డ‌ల్లాస్ – తెలంగాణలో పెట్టుబడులకు పేరొందిన కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా కంపెనీ నేడు ముందుకొచ్చింది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

- Advertisement -

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ , ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివింట్ కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో వివింట్ కంపెనీ ఆర్ అండ్ డీ కేంద్రం ఉంది. సుమారు రూ. 70 కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా హైదరాబాద్ లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది.

జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా ముందుకు రావటంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని, జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ఛార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవెలప్​మెంట్​ సెంటర్

ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ ఇదే కావటం విశేషం.
డల్లాస్‌ లో ముఖ్యమంత్రి , మంత్రి శ్రీధర్ బాబు లు ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్ , రామ బొక్కా రథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని రేవంత్ రెడ్డి ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.

మ‌హాత్మాగాంధీకి నివాళి

డ‌ల్లాస్ చేరుకున్న రేవంత్ నేడు అక్క‌డ ఒక సెంట‌ర్ లో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. ఆయ‌న మంత్రివర్గ సహచరులు .శ్రీధర్ బాబు, , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు కూడా ఈ కార్యక్ర‌మంలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement