చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీపై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసంతో తొలుత హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పిన సన్ రైజర్స్.. ఇప్పుడు తమ రికార్డును తానే బ్రేక్ చేసింది. అనంతరం ఛేజింగ్లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 262 పరుగులకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ, డుప్లెసిస్, దినేశ్ కార్తిక్ రాణించినా.. ఆ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది.
288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ-ఫాఫ్ డుప్లెసిస్ తొలి వికెట్కు ఆరు ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. కానీ హైదరాబాద్ బౌలర్లు పుంజుకోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. 20 బంతుల్లో 42 పరుగులు చేసిన కోహ్లీని మార్కండే బౌల్డ్ చేశాడు. 28 బంతుల్లో 62 పరుగులు చేసిన డుప్లెసిస్ను కమిన్స్ అవుట్ చేశాడు.
విల్ జాక్స్ రనౌట్ అవ్వగా… రజత్ పాటిదార్ 9, సౌరవ్ దిలీప్సింగ్ చౌహాన్ డకౌట్ కావడంతో బెంగళూరు విజయావకాశాలు మూసుకుపోయాయి. కానీ మంచి ఫామ్లో ఉన్న దినేశ్ కార్తిక్ (35 బంతుల్లో 83) అర్ధ శతకంతో మెరిశాడు. కార్తిక్ పోరాటంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 262 పరుగులు చేయగలిగింది. దీంతో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.