Sunday, September 22, 2024

QUAD Meeting – అంత‌ర్జాతీయ భ‌ద్ర‌తే ముఖ్యం – ప్రధాని మోదీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:క్వాడ్‌ ఎవరికీ వ్యతిరేకం కాదనీ, ఇది అంతర్జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో వివాదాల్లో నిమగ్నమై ఉన్న చైనాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అమెరికాలోని డెలావేర్‌లో జరుగుతున్న క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఉద్రిక్తతలు, సంఘర్షణలు చుట్టముట్టిన సమయంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. అలాంటి పరిస్థితిలో భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్‌తో కలిసి పనిచేయడం మొత్తం మానవాళికి చాలా ముఖ్యమని చెప్పారు.

ఇరు దేశాల వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం..2021లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధ్యక్షతన జరిగిన తొలి క్వాడ్‌ సదస్సును ప్రధాని గుర్తుచేసుకున్నారు. చాలా తక్కువ సమయంలో క్వాడ్‌ దేశాలు సహకారాన్ని ప్రతి దిశలో విస్తరించాయని ప్ర‌ధాని చెప్పారు.

- Advertisement -

2025లో ఈ సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండటంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు.

అంతకుముందు ప్రధాని మోదీ.. డెలవెర్‌లోని బైడెన్‌ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువు నేతలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు, భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం చర్చలు ఫలప్రదమైనట్టు ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ‘

డెలవేర్‌లోని గ్రీన్‌విల్లేలో ఉన్న తన నివాసంలో నాకు ఆతిథ్యమిచ్చినందుకు అధ్యక్షుడు బైడెన్‌కు ధన్యవాదాలు. మా చర్చలు ఫలవంతమయ్యాయి. ఈ సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించడానికి మాకు అవకాశం లభించింది’ అంటూ ట్వీట్‌ చేశారు మోదీ.

ట్వీట్‌కు స్పందించిన బైడెన్‌..ప్రధాని మోదీ ట్వీట్‌కు బైడెన్‌ స్పందించారు.. భారత్‌తో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడూ లేనంత బలమైందని చెప్పారు. ఇరు దేశాల భాగస్వామ్యం సన్నిహితమైంది, చైతన్యవంతమైనదని తెలిపారు. మోదీతో భేటీ అయిన ప్రతిసారీ ఇరు దేశాలకు సంబంధించిన కొత్త అంశాలపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement