Sunday, October 6, 2024

Puri – తెర‌చుకున్న జ‌గ‌న్నాధుడి ర‌త్న భాండాగారం…

వేద మంత్రోత్స‌వాల‌తో అభిషేకాలు
ప్ర‌త్యేక పూజ‌లు అనంత‌రం లాక్ ఓపెన్
సాంకేతిక నిపుణులు, వైద్య సిబ్బంది
ఆల‌య క‌మిటీ స‌భ్యులతో లోనికి ప్ర‌వేశం

పూరీ: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు ఆ రహస్య గదికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. 11 మంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇందులో సాంకేతిక నిపుణులు, వైద్య సిబ్బంది, ఆల‌య క‌మిటీ ప్ర‌తినిధులు ఉన్నారు. ఇక 46 ఏళ్ల క్రితం 1978లో చివరిసారిగా దీన్ని తెరిచారు. శ్రీ క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్‌లు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకుండా భాండాగారం తెరిచేందుకు అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియంతా డిజిటలైజేషన్‌ చేయనున్నారు.

- Advertisement -

ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది?అనే విషయాలు తెలియాల్సి ఉంది. భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా? తదితర వివరాలపై స్పష్టత రాలేదు. లోపల విషసర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరీ రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు స్నేక్‌ హెల్ప్‌లైన్‌ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లు లోపలికి తీసుకెళ్లారు..

ఆభరణాలు ఐదు కర్ర పెట్టెల్లో రహస్యంగా..

పూరీ జగన్నాథుని ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా.. 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. రహస్య గదులు జీర్ణావస్థకు చేరి, వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి.

2019 ఏప్రిల్‌ 6న నాటి నవీన్‌ పట్నాయక్‌ సర్కారు నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా, రహస్య గది తాళపుచెవి కనిపించలేదు. దీంతో సభ్యులు వెనుదిరిగారు. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్‌ రఘువీర్‌దాస్‌ కమిటీని నియమించింది. ఇంతలో డూప్లికేట్‌ తాళపుచెవి పూరీ కలెక్టరేట్‌ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు రఘువీర్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవలి ఎన్నికల్లో బిజెపి ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఆ కమిటీ రత్న భాండాగారం తెరవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement