Friday, October 18, 2024

డిసెంబర్‌ 4నుంచి పార్లమెంట్‌ సమావేశాలు..

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారైంది. డిసెంబర్‌ 4 నుంచి 22 వరకు సమావేశాలు జరగనున్నాయి. సెషన్‌ ప్రారంభానికి ఒకరోజు ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, డిసెంబర్‌ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కారణంగా ఒక రోజు ముందుకు జరిపారు. అంటే డిసెంబర్‌ 2నే అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్నాయి. ఈసెషన్‌లో పలు కీలక బిల్లులను ఆమోదింప జేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహోవా మొయిత్రాపై వచ్చిన ”క్యాష్‌ ఫర్‌ క్వరీ” ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ నివేదికను ఈ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్యానెల్‌ సిఫార్సు చేసిన బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి ఉంటుంది. వాస్తవానికి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రతి ఏడాది నవంబర్‌ మూడో వారంలో ప్రారంభమై క్రిస్మస్‌ పండుగకు ముందు ముగుస్తాయి. కానీ, ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల నేపథ్యంలో ఆలస్యంగా పార్లమెంట్‌ వింటర్‌ సెషన్‌ మొదలవుతున్నది. ఎప్పటిలాగే క్రిస్మస్‌ పండుగకు ముందు సెషన్‌ ముగియనుంది.

పార్లమెంట్‌ ముందుకు కీలక బిల్లులు..

- Advertisement -

మొత్తం 19రోజులు 15సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల సవరణలకు సంబంధించిన బిల్లులు చర్చకు రానున్నాయి. ఈ బిల్లులకు సంబంధించిన మూడు నివేదికలు ఇప్పటికే కేంద్ర హోంశాఖ స్టాండింగ్‌ కమిటీకి చేరాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. దీనిని వర్షాకాల సెషన్‌లో ప్రవేశపెట్టినప్పటికీ, ప్రతిపక్షాల నిరసనల మధ్య ఆమోదానికి నోచుకోలేదు.

డిసెంబర్‌ 2న అఖిలపక్షం భేటీ

ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 2వ తేదీన అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. ఉదయం 11గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సాధారణంగా పార్లమెంట్‌ సమావేశాలకు ఒకరోజు ముందు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. అయితే, ఈ సారి డిసెంబర్‌ 3వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలకు రెండు రోజుల ముందు అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించారు. తృణమూల్‌ ఎంపీ మహొవా మోయిత్రాపై క్యాష్‌ ఫర్‌ క్వరీ ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ నివేదికను కూడా ఈ సెషన్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్యానెల్‌ సిఫార్సు చేసిన బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement