Thursday, September 19, 2024

TG | వ‌ర‌ద న‌ష్టంపై సీఎం రేవంత్ స‌మీక్ష !

రాష్ట్రంలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సచివాలయంలో (శుక్రవారం) జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహదారు వేం నరేందర్​ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.

ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలను సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.

వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. వర్షపాతం, హీట్ వేవ్​ లాంటి వాతావరణ, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లపై ఎక్కువగా దృష్టి సారించాలని కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement