Wednesday, September 18, 2024

Olympics – టిటి టీమ్ ఈవెంట్ క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ లో భార‌త్ ..

పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించింది. ఒలింపిక్స్ టిటిలో మ‌హిళ‌ల జట్టు క్వార్టర్స్ చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ఈవెంట్‌లో శ్రీజ, అర్చన, మణిక బృందం అద్భుత ప్రదర్శన చేసి రొమేనియాను ఓడించారు. ఈ ఉత్కంఠ పోరులో ప్రపంచ 11వ ర్యాంకర్ టీమిండియా 3-2తో నాలుగో నంబర్ టీమ్ రొమేనియాపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ జట్టు అమెరికా లేదా జర్మనీతో పోటీ పడే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో శ్రీజ, అర్చన జోడీ తొలి మ్యాచ్‌లో రొమేనియాకు చెందిన ఎడినా, సమారా జోడీని 3-0తో ఓడించి ముందంజ వేసింది. 11-9, 12-10, 11-7 తేడాతో రొమేనియా జ‌ట్టుపై విజయం సాధించింది. ఆ తర్వాత.. మణిక తదుపరి సింగిల్ మ్యాచ్‌లో బెర్నాడెట్‌ను 3-0తో సులభంగా ఓడించింది. మణికా 11-5, 11-7, 11-7 తేడాతో బెర్నాడెట్‌ను ఓడించింది. దీంతో భారత జట్టు రొమేనియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది.

- Advertisement -

తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు ఎలిజబెత్ సమారాతో జరిగిన ఉత్కంఠ సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీజ ఆకుల ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సమర 3-2తో శ్రీజను ఓడించింది. శ్రీజ, సమర మధ్య జరిగిన మ్యాచ్ లో 8-11, 11-4, 7-11, 11-6, 11-8 తేడాతో సమర గెలిచింది. ఈ మ్యాచ్‌లో శ్రీజ ఓడిపోయినప్పటికీ, రొమేనియాపై భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.

ఆ తర్వాత బెర్నాడెట్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అర్చన కామత్ 3-1 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అర్చన 5-11, 11-8, 7-11, 9-11 తేడాతో ఓడిపోయింది.. దీంతో.. భారత్, రొమేనియా మధ్య స్కోరు 2-2తో సమమైంది. కాగా.. చివరి మ్యాచ్‌లో మ్యాచ్ ఫలితం డిసైడ్ అయింది. ఈ మ్యాచ్‌లో మనిక బ‌త్రా 3-0 (11-5, 11-9, 11-9)తో ఎడినా డియాకానును ఓడించి జ‌ట్టును క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ చేర్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement