Friday, October 18, 2024

TG | గ్యారెంటీలు లేవు కానీ.. చార్జీలు పెంచడం గ్యారెంటీ: కేటీఆర్‌

ఆంధ్రప్రభ స్మార్ట్​: కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు చార్జీలు పెంచి వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలేనని మంగళవారం ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు. విద్యుత్‌ సరఫరాకు గ్యారంటీ లేదు కానీ.. షాకులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే చార్జీలు పెంచి జనంపై భారం మోపేందుకు ప్ర‌భుత్వం రెడీ అయ్యింద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన ఒక్క గ్యారంటీ కూడా సరిగ్గా అమలు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన ₹77 వేల కోట్లు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు.

- Advertisement -

జీరో బిల్లు కోసం చూస్తుంటే..

‘కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతున్నది. విద్యుత్ సరఫరాకు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ. పవర్‌లోకి వచ్చి ఏడాది కాకముందే, పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా.

420 హామీల మాటేమైంది..

ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు. 420 హామీలకు అతీ గతీ లేదు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే?. మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement