Friday, October 18, 2024

New Delhi – ఎన్నికల్లో ఉచితాలు…కేంద్రానికి,ఈసీకి సుప్రీం నోటీసులు

సుప్రీంకోర్టులో పిటిషన్‌..
ఉచితాలు లంచంతో సమానం ..
విచార‌ణ‌కు స్వీక‌ర‌ణ

న్యూఢిల్లీ – ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాల హామీలను లంచాలుగా పరిగణించాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీం కోర్టు భారత ఎన్నికల సంఘానికి, కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.

కాగా, రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఉచిత వాగ్దానాలు చేయకుండా నిరోధించడానికి చర్యలు తీసుకునేలా పోల్‌ ప్యానెల్‌ను ఆదేశించాలని పిటిష‌నర్ ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని కోరారు. ఈ ఉచితాల కారణంగా ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతుందని అభ్యర్థనలో వెల్లడించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. ఇదే అంశంపై పెడింగ్‌లో ఉన్న పలు కేసులతో కలిపి దీన్ని విచారించాలని సుప్రీం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేశారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది విజయ్‌ హన్సారియా ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఉచిత వాగ్దానాలు ఓటర్లపై తీవ్ర ప్రభావితం చూపడంతో పాటు ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీస్తున్నాయని న్యాయస్థానంలో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement