Friday, September 13, 2024

Nagarjunasagar – కుప్పకూలిన సుంకిశాల గోడ‌..

గుట్టుగా ఉంచ‌డానికి ఆంత‌ర్య‌మేంటి?
నిర్మాణంలో ఉండగానే కొట్టుకుపోయిన వైనం
త‌ప్పిన ప్రాణ న‌ష్టం.. ఈ నెల ఒక‌టిన ప్ర‌మాదం
అయినా బయటకు తెలియకుండా దాచిన అధికారులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, నల్లగొండ : నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి హైద‌రాబాద్ న‌గ‌రానికి నీటిని తరలించేందుకు నల్లగొండ జిల్లా సుంకిశాల వద్ద నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయింది. అయితే షిప్టు మారుతున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. ఈ నెల ఒకటో తేదీన ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌టికీ అధికారులు గుట్టుగా ఉంచ‌డానికి కార‌ణ‌మేమిటో అని ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ₹2215 కోట్లతో సుంకిశాల ప్రాజెక్టు పనులు ప్రారంభ‌మ‌య్యాయి. గోడ కూల‌డంతో మ‌రో ఏడాది వ‌ర‌కు ప‌నులు చేప‌ట్టే అవ‌కాశం లేదు.

- Advertisement -

ప్ర‌మాదం జ‌రిగిందిలా…

సాగర్ డెడ్ స్టోరేజ్ నుండి నీటిని సుంకిశాల పంప్ హౌస్ లోకి తరలించేందుకు టన్నెల్ కు అడ్డుగా గోడను నిర్మిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుండి వ‌చ్చిన‌ వరద నీరు నిర్మాణంలో ఉన్న గోడ‌పై ప్ర‌వ‌హించింద‌ని, ఆ నీటి ఉధృతికి రిటైనింగ్ వాల్ కూలిపోయింద‌ని తెలుస్తోంది. దీంతో సొరంగం ద్వారా భారీగా నీరు పంప్ హౌస్ లోకి చేరుకుంది. నీటి ఉధృతికి పనులు కోసం ఉంచిన‌ హిటాచీలు, ఇతర వాహనాలు సాగ‌రంలోకి కొట్టుకుపోయాయి. కూలీలు షిఫ్ట్ మారిన సమయంలో అకస్మాత్తుగా రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.

రూ.2215కోట్ల‌తో ప‌నులు

హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి సాగర్ నుండి 270 బిలియన్ గ్యాలన్ల నీటిని ఏఎంఆర్పీ ద్వారా జలాలను తరలిస్తున్నారు. అయితే సాగర్‌లో నీటి నిల్వ‌ తక్కువగా ఉన్న సమయంలో నీటిని తరలించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతుండడంతో డెడ్ స్టోరేజ్ నుండి హైదరాబాదుకు నీటిని తరలించేందుకు సుంకిశాల వ‌ద్ద‌ పనులను చేపట్టింది. గ‌త‌ ప్రభుత్వం హ‌యాంలో రూ. 2215 కోట్లతో సుంకిశాల ప్రాజెక్టు పనులు ప్రారంభ‌మ‌య్యాయి. సాగ‌ర్‌లో 480 అడుగుల డెడ్ స్టోరేజ్ లో నీటి నిల్వ ఉన్నా… టన్నెల్ ద్వారా సుంకిశాల పంప్ హౌస్ లోకి ఆ నీటిని చేరుస్తారు. అక్కడి నుండి మోటార్ల ద్వారా తోడి పైప్‌లైన్‌ ద్వారా కోదండపూర్ కి నీటిని త‌ర‌లిస్తారు. అక్కడి నుండి హైదరాబాద్‌ నగరానికి కృష్ణా జలాలను తరలిస్తారు. ఈ క్రమంలో సొరంగం ద్వారా పంపు హౌస్ లోకి నీరు రాకుండా అడ్డుగా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఆ గోడే ప్ర‌స్తుతం కూలిపోయింది.

ర‌హ‌స్య‌మెందుకో?

ఈ నెల ఒకటవ తేదీన సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయినా విషయం బయటికి పొ క్కకుండా హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు గుట్టుగా ఉంచారు. అక్కడ పనిచేసే కూలీలలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. సుంకిశాల పనులు జరుగుతున్న ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement