Wednesday, October 16, 2024

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌కు నేటి నుంచి నామినేష‌న్స్…

హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఆ స్థానాల భర్తీకి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ నియోజకవర్గానికి ఎన్నికల అధికారిగా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ అదనపు కమిషనర్ , వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ మండలి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. నేటి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. మరుసటిరోజు నామినేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు నిర్వహిస్తారు. 17న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స్థానంలో 5.60 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఉన్నారు. 616 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. డీఆర్సీ కేంద్రంగా ఎల్బీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం ఉండ‌నుంది. వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్ బాధితుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌నున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు పోస్ట‌ల్ బ్యాలెట్ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement