దేశంలో జీఎస్టీ వసూళ్లు మే నెలలో 1,57,090 కోట్లుగా నమోదయ్యాయి. గత సంవ్సరం ఇదే కాలంతో పోల్చితే 12 శాతం ఎక్కువ వసూళ్లు అయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ నెలలో రికార్డ్ స్థాయిలో 1.87 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. 1.4 లక్షల కోట్లకు పైగా వరసగా 14 నెలల నుంచి జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయి. దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత 1.5 లక్షల కోట్లకు పైగా వసూలు కావడం ఇది 5వ సారి. మే నెలలో వసూలైన మొత్తం జీఎస్టీలో సీజీఎస్టీ 28,411 కోట్లు, ఎస్జీఎస్టీ 35,828 కోట్లు, ఐజీఎస్టీ 81,363 కోట్లు ఉన్నాయి.
ఐజీఎస్టీలో వచ్చిన వాటిలో దిగుమతి అయిన గూడ్స్పై 41,772 కోట్లు వచ్చాయి. దిగుమతి అయిన వస్తువులపై వచ్చిన సెస్ 1,057 కోట్లతో కలిసి మొత్తం సెస్ వసూళ్లు 11,489 కోట్లుగా ఉన్నాయి. మే నెలలో వచ్చిన మొత్తం జీఎస్టీ వసూళ్లలో కేంద్రానికి సీజీఎస్టీగా 63,780 కోట్లు, ఎస్జీఎస్టీగా 65,597 కోట్లును కేంద్రం సెటిల్ చేసింది. మే నెలలో దిగుమతి అయిన వస్తువులపై వచ్చిన ఆదాయం 12 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం 11 శాతం పెరిగింది.