Thursday, September 19, 2024

TG | వేములవాడ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దక్షిణ కాశీగా బాసిల్లుతున్న వేములవాడ క్షేత్రాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాచీన వాస్తు రీతులను పునర్‌ ప్రతిష్టిస్తూ వేములవాడను అంతర్జాతీయ టెంపుల్‌ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ పరిశీలిస్తోంది ప్రభుత్వం. టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి సేకరించిన అత్యధిక రిజల్యూషన్‌ శాటిలైట్‌ డేటాతో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే బేస్‌ మ్యాప్‌ను సిద్ధం చేయించి కౌంటర్‌ సర్వేను ప్రభుత్వం ప్రారంభించింది.కౌంటర్‌ పరిశీలనకోసం జియో స్పేషియల్‌ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్‌కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం డ్రాప్ట్‌ దశలో ఉన్న మాస్టర్‌ ప్లాన్‌ పై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్రవేయనునట్లు తెలిసింది.

అలాగే వేముల వాడ టౌన్‌ ప్లానింగ్‌ పెండింగ్‌ పనుల అంచనావ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు విడుదల చేసింది. టౌన్‌ ప్లానంగ్‌ అభివృద్ధికోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 58.5కోట్లు కేటాయించి భూసేకరణ, రోడ్లు, మిషన్‌ భగీరథ పనులను పూర్తి చేయగా ఆలయాభివృద్ధితో పాటు మిగిలిన పెండింగ్‌ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నది.

పురావస్తు ఆధారాలమేరకు వేములవాడ చాళుక్యుల రాజధానిగా ప్రఖ్యాతి గాంచి జైన, శైవ, వైష్ణవ కేంద్రంగా చరిత్రలో నిలిచింది.ఈ నగరాన్ని రాజరాజనరేంద్ర చోళుడు నిర్మించినట్లు రాక్‌ శాసనాధారాలతో పాటుగా అనేక ఆధారాలు లభ్యమవుతున్నాయి. క్రీ.శ. 750 నుంచి చరిత్ర లభ్యమవుతోంది.

చాళుక్యుల కాలంలోనే వేముల వాడ పుణ్య క్షేత్రం నిర్మాణం జరగగా కాకతీయుల ఏలుబడిలో గొప్ప శైవ క్షేత్రంగా సుప్రసిద్ధి చెందింది. అనేక రాజవంశాలు వేముల వాడ రాజరాజేశ్వర ఆలయం అభివద్ధికి పాటుబడ్డాయి. తెలంగాణలో సుప్రసిద్ధ శైవాలయం వేముల వాడ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృృష్టి సారించింది.

- Advertisement -

ఇప్పటి వరకు చుట్టుపక్కల ప్రాంతాలైన సంకెపల్లి,చంద్రగిరి, మరుపాక, జయవరం, తెట్టెకుంట, ఆరెపల్లిల తదితర గ్రామాల అభివృద్ధికి వేముల వాడ దేవాలయ ప్రాంత అథారిటీని ఏర్పాటు చేసి పనులు ప్రారంభించింది. వేముల వాడ ఆలయ ప్రాంగణం తోపాటుగా చుట్టు పక్కల ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించింది.

మాస్టర్‌ ప్లాన్‌ లో కాటేజీలు, బస్‌ స్టేషన్‌ నిర్మాణం, యాత్రికుల సౌకర్యాలు,వేదపాఠశాల, నాట్యకళాశాల,అన్నదానం కాంప్లెక్స్‌,అభిషేకం మంటపం, కోడెల విశ్రాంతి మండపం, ప్రసాదాల కాంప్లెక్స్‌, స్నానఘట్టాలు ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే యాత్రికులు బడ్డి పోచమ్మ గుడిని సందర్శించడంతో నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది.

ఈ నేపథ్యంలో దాదాపుగా 4704 చదరపు గజాల స్థలాన్ని సేకరించి పనులను పూర్తించేశారు. వేముల వాడ మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదం అనంతరం ఆలయాభివృద్ధికోసం వాస్తు నిపుణులతో సమావేశం అయ్యేందుకు ప్రభుత్వంయోచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement