Wednesday, September 18, 2024

Manu Bhaker | కాంస్య కాంతి వెలుగులో తొలి మహిళ

పారిస్ ఒలింపిక్స్ 2024లో చారిత్రాత్మక రీతిలో భారత్‌కు తొలి ప‌త‌కం సాధించిన‌ షూటర్ మను భాకర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కాగా, ఆమె స్వస్థలం హర్యానా. అయితే, హర్యానా అథ్లెట్లలో ఎక్కువగా బాక్సర్లు, రెజ్లర్లే ఉంటారు. వారికి భిన్నంగా మను భాకర్ షూటింగ్‌లో కాంస్యాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్ కేటగిరిలో భారత్‌కు పతకాన్ని అందించిన తొలి మహిళగా మను చరిత్ర సృష్టించింది.

నిజానికి టెన్నిస్, స్కేటింగ్ , బాక్సింగ్ వంటి క్రీడలను కూడా ఆమె ప్రయత్నించింది. అంతేకాదు ‘తంగ్ టా’ అనే మార్షల్ ఆర్ట్స్‌లో కూడా రాణించి జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. దేనినైనా త్వరగా నేర్చుకునే సహజ లక్షణం ఉన్న ఆమె చివరికి షూటింగ్‌లో ప్రావీణ్యం సాధించి సత్తా చాటింది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో ఎన్నో రికార్డులు

2016 రియో ఒలింపిక్స్ ముగిసే సమయానికి మను భాకర్ వయసు కేవలం 14 సంవత్సరాలే. ఆ సమయంలో ఆమె తొలిసారి షూటింగ్‌ మొదలుపెట్టింది. టీనేజ్ వయసు నుంచే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో రాణించిన మ‌ను.. 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ పతక విజేత, మాజీ ప్రపంచ నంబర్-1 షూటర్ హీనా సిద్ధూను ఆమె ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది. రికార్డు స్థాయిలో ఆమె 242.3 స్కోరు సాధించి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో చరిత్ర తిరగరాసింది.

ఇక 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది. ఆ తర్వాత 2018లో జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్‌కు అర్హత సాధించి జూనియర్ కేటగిరిలో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. కేవలం 16 ఏళ్ల వయస్సులో ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాలు సాధించింది.

- Advertisement -

ఇక 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను స్వర్ణాన్ని సాధించి రికార్డు సృష్టించింది. 2019లో మ్యూనిచ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో నాలుగవ స్థానం సాధించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆ తర్వాత 2021లో న్యూఢిల్లీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ టీమ్ విభాగంలో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం గెలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement