Friday, October 18, 2024

Kyrgyzstan: అల్ల‌ర్లు…వ‌ర్శిటీల‌లో విద్యార్ధుల‌పై దాడులు

కిర్గిస్థాన్ రాజధాని బిష్కేశ్‌లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు కొత్త సమస్యలో కూరుకుపోయారు. ఇక్కడి స్థానిక ప్రజలు విదేశీ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. అటువంటి హింసాత్మక గుంపు నగరం అంతటా అల్లర్లు సృష్టించింది. విదేశీ విద్యార్థులపై దాడి చేసింది. ఈ దాడిలో పాకిస్థానీ విద్యార్థులు అత్యధికంగా బాధితులు, గుంపు దాడి కారణంగా దాదాపు నలుగురు పాకిస్థానీ విద్యార్థులు మరణించారు. దీంతో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులందరిలో భయాందోళన వాతావరణం నెలకొంది.

- Advertisement -

భారతదేశం, పాకిస్తాన్, ఇతర దేశాల నుండి వేలాది మంది విద్యార్థులు మెడిసిన్ చదవడానికి కిర్గిజ్‌స్థాన్‌కు వెళతారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కేష్‌లో ఎక్కువ మంది విద్యార్థులు నివసిస్తున్నారు. అయితే ఇటీవల పరిస్థితులు దారుణంగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఈజిప్టు విద్యార్థులు అక్కడ దోపిడీ చేస్తున్న స్థానిక దొంగలతో క‌ల‌సి దాడులకు పాల్ప‌డుతున్నారు. ముఖ్యంగా పాక్, ఇండియా, అప్ఘ‌నిస్తాన్ విద్యార్ధులే టార్గెట్‌గా దాడులు కొన‌సాగుతున్నాయి.

కాగా, కిర్గిస్థాన్ రాజ‌ధాని బిషెక్‌లో విదేశీ విద్యార్థుల‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అక్క‌డ ఉంటున్న విద్యార్ధుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ప్ర‌స్తుతం అక్క‌డి ఆందోళ‌న‌కర‌ ప‌రిస్థితి దృష్ట్యా భార‌త విద్యార్థులు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని తెలిపింది. ఈ మేర‌కు అక్క‌డి భార‌త ఎంబ‌సీ ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా కీల‌క సూచ‌న చేసింది. ఇక ఘ‌ర్ష‌ణ‌లు తీవ్ర‌మైతే అక్క‌డి నుంచి భార‌తీయ విద్యార్ధుల‌ను ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కి కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

“మ‌న స్టూడెంట్స్ తాలూకు స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నాం. ప్ర‌స్తుతానికి ప‌రిస్థితి ప్ర‌శాంతంగానే ఉన్న‌ప్ప‌టికీ, విద్యార్థులు బ‌య‌ట‌కు రావొద్దు. ఏదైనా స‌మ‌స్య ఉంటే వెంట‌నే రాయ‌బార కార్యాల‌యాన్ని సంప్ర‌దించండి” అని ఎంబ‌సీ ట్వీట్ చేసింది. అలాగే 24 గంట‌లు అందుబాటులో ఉండే 0555710041 ఫోన్ నంబ‌ర్ కూడా ఇచ్చింది. ఇక కిర్గిస్థాన్ లో సుమారు 15 వేల మంది బార‌తీయ‌విద్యార్ధులున్న‌ట్లు స‌మాచారం.

ఇక ఇదే విధంగా పాక్ రాయబార కార్యాలయం త‌మ‌ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లవద్దని, తమ హాస్టళ్లకే పరిమితం కావాలని సలహా జారీ చేశారు. పాకిస్తాన్‌లోని 10 వేల మంది విద్యార్థులు కిర్గిజ్‌స్థాన్‌లో చదువుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement