Thursday, September 19, 2024

KTR Twit – మేం చెప్పిందే నిజం .. గిరిజ‌నుల సొమ్ము బొక్కేశారు…

గిరిజనుల సొమ్ము
ఎన్నికలకు వాడారు
వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్​ నేతలు
చార్జిషీట్​లో వివరాలు వెల్లడించిన ఈడీ
187 కోట్లు దారి మళ్లించారని నిర్ధారణ
హైదరాబాద్​కు చెందిన బిల్డర్​ కూడా ఉన్నారు
తెలంగాణ కాంగ్రెస్​ నేతలకూ భాగస్వామ్యం
దోషులను కఠినంగా శిక్షించాలన్న కేటీఆర్​

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: వాల్మీకీ స్కామ్‌ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న జ‌రిగిన‌ లోక్‌సభ ఎన్నికల్లో వాడిందని.. ముందు నుంచి తాము అన్నదే నిజమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ట్వీట్ చేశారు.

187 కోట్లు దారి మ‌ళ్లించారు..
వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్‌ నేత, కర్నాటక మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన చార్జిషీట్‌లో నిర్ధారించిందని కేటీఆర్‌ అన్నారు. కర్నాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారిమళ్లాయని తెలిపారు. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్‌సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించిందని పేర్కొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల హ‌స్తం..

వాల్మీకి స్కామ్‌లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ అని తెలిపారు‌. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్‌ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఇతనికి సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయన్నారు. ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు అనేది నిర్వివాదమని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలు వాల్మీకి స్కామ్‌ నిజాలు నిగ్గుతేల్చాలని.. దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement