Wednesday, October 23, 2024

Breaking | కేంద్రమంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీస్

తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్న కేటీఆర్
వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరిక
కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తనపై నిరాధారమైన, తన పరువున‌కు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈనెల 19వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బండి సంజయ్ చేసిన నిరాధరమైన కామెంట్లను నోటీసులో పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా తీశారని చెప్పారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులో తెలిపారు. కేవలం తనను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ వ్యాఖ్యలు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, ఫోన్ ట్యాపింగ్ చేశానని, కేసుల నుంచి తప్పించుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా కలిసిపోయానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని కేటీఆర్ సవాల్ చేశారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువున‌కు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయబడ్డాయని, దీని కారణంగా ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకొని ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సహా డ్రగ్స్ ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. వాటిన్నింటిని ఉద్దేశపూర్వకంగా కల్పించిన కట్టుకథలుగా కొట్టిపారేశారు.

- Advertisement -

కేంద్రమంత్రిగా బాధ్యతయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ లాంటి వ్యక్తి చేసే ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం తనపై బురద చల్లాలన్న దురుద్దేశం, తమ పార్టీ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ నోటీసులో తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, 9 ఏళ్లు రాష్ట్ర మంత్రి గా తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేసిన తనను ఉద్దేశపూర్వకంగా బద్నాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారని చెప్పారు. గతంలోనూ బండి సంజయ్ తనపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారన్నారు.

రాజకీయంగా తనను ఎదుర్కొనే శక్తి లేకనే తన వ్యక్తిత్వంపై బురదచల్లే ప్రయత్నం గత కొన్ని సంవత్సరాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే ఇలాంటి ఆరోపణలు చేయటం ద్వారా ప్రజల్లో తన ప్రతిష్టను నాశనం చేయాలనే కుట్ర తప్ప వారి ఆరోపణల్లో నిజం లేదన్నారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. అసత్య ప్రచారం చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ లీగల్ నోటీసులో హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement