గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్.. మూడు స్థానాల ఎన్నికలను అత్యంత సీరియస్గా పరిగణిస్తున్నారు. ప్రతి అంశాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తూ.. చతురంగ బలగాలను మోహరించారు. ఏ ప్రాంతంలో.. ఏ వ్యూహం అవలంబించాలి.. అక్కడికి ఎవరిని పంపాలి? ఏ వర్గాన్ని ఎలా మచ్చిక చేసుకోవాలి? అయిన వారెవరూ.. కాని వారెవరు? దగ్గరికి తీస్తే కలిసొచ్చేదెవరు? వంటి అంశాలన్నీ సీఎం స్వయంగా ప్లాన్ చేసి.. నేతలకు బాధ్యతలు అప్పజెపుతున్నారు. నేరుగా ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో మాట్లాడుతున్నారు…
హైదరాబాద్, దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అపజయాలకు బ్రేక్ వేయకుంటే రాబోయే సాధారణ ఎన్నికల్లో ఇబ్బందులు తప్ప వని గ్రహించిన సీఎం ఇతర నేతలకు బాధ్యతలు అప్పగించే పాత సంప్రదాయానికి స్వస్తి పలికి నేరుగా తానే.. పర్యవేక్షిస్తూ యం త్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మార్చి 14న పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుం డగా, ఏప్రిల్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనుంది. హైదరా బాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ ఎస్ పోటీ చేయదని మొదట భావించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆరు మాసాల క్రితం చురుకుగా నిర్వహించిన టీఆర్ఎస్ యంత్రాంగం.. ఆ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయింది. దీంతో గత అనుభవాల దృష్ట్యా టీఆర్ఎస్ పోటీ చేయదనుకున్నారు. ఎవరో ఒకరికి మద్దతు ఇస్తుందన్న ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఆఖరి నిమిషాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు మార్తె వాణీదేవిని బరిలో నిలిపి విపక్షాలకు షాకి చ్చారు. ఇతర జిల్లాలకు చెందిన మంత్రులను ఇన్ఛార్జి లుగా నియమించారు. నియోజకవర్గాల వారీగా బాధ్యతలు పంచారు. ప్రచారంలో.. ఏఏ అంశాలను ప్రస్తావించి బీజేపీని ఇరుకున పెట్టాలో ఖరారు చేశారు. దీంతో టీఆర్ఎస్ ఈసారి ప్రచారం సందర్భంగా అత్యంత పదునుగా, చురుకుగా వ్యవహరిస్తోంది. మంత్రి హరీష్రావును చాలా కాలం తర్వాత సీఎం రంగంలోకి దింపడం, సామాజిక సమీకరణల్లో భాగంగా.. హైదరాబాద్ ఇన్ఛార్జిగా గంగుల కమలా కర్ను నియమించడం సీరియస్నెస్కు అద్దం పడు తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య వ్యూహాలతో విపక్షాలు ఖంగుతినగా, ఇపుడు హైదరాబాద్ రాజకీ యం రసవత్తరంగా మారింది.
నల్లగొండలో ఎమ్మెల్యేలకు పరీక్ష
నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మంత్రు లు, ఎమ్మెల్యేలకు సీఎం పరీక్ష పెట్టారు. మూడు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎంకు సన్నిహితులలో ఒకరిగా పేరున్న పల్లా రాజేశ్వరరెడ్డిని ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా ముందునుండీ ప్రచారం ప్రారంభించగా, ఆదిలో క్షేత్రస్థాయి నేతలు పలువురు కలిసిరాలేదు. కొందరు ఎమ్మెల్యేలు అంత సీరియస్గా తీసుకోలేదు. సీఎం సమీక్ష నిర్వహించి.. సీరియస్గా నేతలకు బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యేలలో మార్పు వచ్చింది.
వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సీరియస్గా వర్క్ జరుగుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇచ్చే పదవులకు.. ఈ ఎన్నికల్లో పనితీరు ప్రామాణికంగా సీఎం చెప్పారు. నియోజకవర్గస్థాయి సమావేశాలు, ప్రచారంలో పల్లా ఇతర అభ్యర్థులకంటే ముందం జలో ఉన్నారు. సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పరి స్థితులను ప్రతిరోజూ తెలుసుకుంటున్నారు. పలువురు నేతలకు ఫోన్లు చేసి పరిస్థితి ఆరా తీస్తున్నారు. అభ్యర్థులను కూడా వాకబు చేస్తున్నారు. ప్రతి 50 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించుకుని, నమోదు చేసిన ఓట్లు పోలింగ్ బూత్కు తీసుకొచ్చేలా యంత్రాం గం పనిచేయాలని నిర్దేశిస్తున్నారు.
సాగర్లో స్ట్రాటజీలు
నాగార్జునసాగర్లో గెలుపుకు సీఎం కేసీఆర్ పకబ్బందీ స్ట్రాటజీలు అమలుచేస్తున్నారు. అకాల మరణం చెందిన నోముల నర్సింహ్మయ్య కుటుం బాన్ని అక్కున చేర్చుకున్న సీఎం కేసీఆర్.. క్షేత్రస్థాయి పరిస్థితులు, అభ్యర్థులపై అనేక సార్లు సమావేశాలు నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో పలుమార్లు సమీక్షలు జరిపి.. వరాల జల్లు కురిపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అందులో అమలుకాని జాబితా సిద్ధం చేయించి హామీలపై స్వయంగా ఆరా తీశారు. అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న యాదవ, లంబాడ సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నియోజక వర్గంలో 2.17 లక్షల ఓట్లు ఉండగా, ఈ రెండు వర్గాల ఓట్లు సుమారు 80 వేల వరకు ఉన్నాయి. లంబాడ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న తిరుమలగిరి మండలంలో నెల్లికల్లు ఎత్తిపోతల పథకం మంజూరు చేశారు. 4 వేల మంది గిరిజనులకు పాస్ పుస్తకాలు అందజేశారు.
సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎన్నికల పనిపైనే ఉండాలంటూ స్పష్టంగా ఆదేశించారు. ప్రతి 43మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించారు. ఇన్ఛార్జిల సమన్వయానికి.. ఎమ్మెల్యేలు, మేయర్లకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థి ఖరారుపై మునుపెన్నడూ లేనంత కసరత్తును చేస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికే.. మరోసారి టికెట్ కేటాయించాలని నిర్ణయించారు. దుబ్బాక అభ్యర్థిత్వం విషయంలో.. ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు.