Friday, October 18, 2024

క్రిస్‌ గేల్‌ రికార్డును బ్రేక్‌ చేసిన ఇషాన్‌

బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలోఇషాన్‌ కిషన్‌ చెలరేగిపోయాడు. డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. బంగ్లాదేశ్‌పై విరుచుకుపడి బ్యాటింగ్‌ చేశాడు. వన్డేల్లో తొలిసారి ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. ఇషాన్‌ 126 బంతుల్లో200 రన్స్‌ స్కోరు చేశాడు. ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. తొలుత టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ధావన్‌ త్వరగా ఔటైనా… ఇషాన్‌ , కోహ్లీలు రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ ఇద్దరూ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేయడం ఇది నాలుగో ఇండియన్‌ బ్యాటర్‌ ఘనత. ఇషాన్‌ 210 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద నిష్క్రమించాడు. దీంతో కోహ్లీ, ఇషాన్‌ భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ కొట్టిన ఘనతను ఇషాన్‌ కిషన్‌ దక్కించుకున్నాడు.

ఇండియా 35.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. తొలి రెండు వన్డేల్లో ఇండియా ఓడిన విషయం తెలిసిందే. గతంలో డబుల్‌ సెంచరీ నమోదు చేసిన విండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ రికార్డును కిషన్‌ బ్రేక్‌ చేశాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో గేల్‌ 138 బంతుల్లో జింబాబ్వేపై డబుల్‌ సెంచరీ చేయగా శనివారం బంగ్లాపై కిషన్‌ కేవలం 126 బంతుల్లో డబుల్‌ సెంచరీ అందుకున్నాడు. గేల్‌ కన్నా 12 తక్కువ బాల్స్‌లోనే కిషన్‌ ఆ రికార్డును దాటేశాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన యువ క్రికెటర్‌గా కూడా నిలిచాడు ఇషాన్‌ కిషన్‌.

మ్యాచ్‌ అనంతరం ఇషాన్‌ కిషన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఔట్‌ కాకపోయి ఉంటే ట్రిపుల్‌ సెంచరీ చేసేవాడినేమో అని అన్నాడు. నేను అవుట్‌ అయ్యేసరికి 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి అని ఆయన గుర్తు చేశాడు. ఇండియా తరపున గతంలో సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రోహిత్‌ శర్మలు తమ ఖాతాలో డబుల్‌ సెంచరీ నమోదు చేసుకున్నారు. ఇక వన్డే హిస్టరీలో డబుల్‌ సెంచరీ స్కోర్‌ చేసిన ఏడో బ్యాటర్‌గా నిలిచాడు ఇషాన్‌ కిషన్‌. ఈ రికార్డును అందుకున్న వారిలో మార్టిన్‌ గప్తిల్‌, ఫకర్‌ జమాన్‌ కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement