Monday, October 14, 2024

International Yoga Day | అప్పుడే మార్పు మొదలు.. ప్ర‌ధాని మోదీ

శ్రీనగర్‌: స్వదేశంతోపాటు విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని గుర్తుచేశారు. శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ప్ర‌సంగించారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని తెలిపారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు. తొలుత ప్రఖ్యాత డాల్‌ సరస్సు ఒడ్డున దాదాపు 7 వేల మందితో కలసి మోదీ ఆసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అప్పటికప్పుడు వేదికను షేర్‌-ఏ-కశ్మీర్‌ సమావేశ కేంద్రానికి మార్చారు.

ప్రధాని మోదీ రాక నేపథ్యంలో కశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు జైశంకర్‌, బీఎల్‌ వర్మ, కిషన్‌ రెడ్డి, ప్రహ్లాద్‌ జోషి, హెచ్‌డీ కుమారస్వామి, కిరణ్‌ రిజిజు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో హాజ‌ర‌య్యారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దిల్లీలోని యమునా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సైతం దిల్లీలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరిహద్దుల్లో సైనికుల దగ్గరి నుంచి ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య యుద్ధనౌక వరకు అనేక చోట్ల యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement